US Ireland ODI: కరోనా మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ పలు దేశాల్లో విజృంభిస్తోంది. దీంతో ఇప్పటికే పలు సిరీస్లు వాయిదా పడ్డాయి. తాజాగా యూఎస్ఏ-ఐర్లాండ్ మద్య జరగాల్సిన వన్డే సిరీస్ను రద్దు చేస్తున్నట్లు ఇరుబోర్డులు ప్రకటించాయి.
"ఇప్పటికే నిర్ణయించిన యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన వన్డే సిరీస్ రద్దు చేస్తున్నాం. ఈ విషయం తెలిపేందుకు ఎంతో బాధగా ఉంది" అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు అధికారులు.
ఇప్పటికే ఐర్లాండ్ జట్టు సహాయ సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయింది. ఇరుజట్ల ఆటగాళ్లకు మాత్రం నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. కానీ ముందు జాగ్రత్త చర్యల నిమిత్తం ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని ఈ టోర్నీని రద్దు చేశారు.
ఇరుజట్ల మధ్య జరగాల్సిన మొదటి వన్డే ఇప్పటికే రద్దయింది. రెండో, మూడో వన్డేలు బుధవారం, గురువారం జరగాల్సి ఉన్నాయి. కానీ మహమ్మరి కారణంగా ఈ మ్యాచ్లను రద్దు చేస్తున్నట్లు ఇరుజట్లు ప్రకటించాయి.
కాగా, ఐర్లాండ్ జట్టు డిసెంబరు 31న వెస్టిండీస్ పర్యటనకు బయల్దేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడిన సహాయక సిబ్బంది ఐసోలేషన్ పూర్తి చేసుకుని, పూర్తిగా కోలుకున్న తర్వాత జట్టుతో చేరనున్నారు.