టీమ్ ఇండియా క్రికెటర్ పృథ్వీ షా పై కొందరు దాడికి పాల్పడ్డారు. బుధవారం ముంబయిలోని ఓ హోటల్ వద్ద జరిగిన ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. అసలు ఏం జరిగిందంటే..
పోలీసుల సమాచారం ప్రకారం..స్టార్ ఆటగాడు పృథ్వీ షా తన స్నేహితుడు సురేంద్రతో కలిసి బుధవారం రాత్రి ముంబయిలో శాంతా క్రూజ్లోని ఓ ఫైవ్ స్టార్ హోటల్కు వెళ్లాడు. అక్కడ షాను చూసిన కొందరూ సెల్ఫీ దిగేందుకు ముందుకొచ్చారు. అయితే అక్కడున్న ఇద్దరితో మాత్రమే సెల్ఫీ దిగేందుకు పృథ్వీ ఆసక్తి చూపించడంతో మిగతా వారు అసహనం వ్యక్తం చేశారు. తమతో కూడా ఫొటో దిగాలని కోరారు. దానికి షా నిరాకరించడంతో సదరు వ్యక్తులు తమకు సెల్ఫీ ఇచ్చే తీరాలంటూ డిమాండ్ చేశారు. దీంతో అక్కడే ఉన్న షా స్నేహితుడు హోటల్ మేనేజర్కు కంప్లైంట్ చేశాడు. అక్కడికి వచ్చిన మేనేజర్ నిందితులను వెళ్లగొట్టాడు.
ఇదంతా మనసులో పెట్టుకున్న నిందితుల్లోని ఓ మహిళా.. షా కారును వెంబడించింది. అంతే కాకుండా అతడితో వాగ్వవాదానికి దిగింది. అతడిపై దాడి కూడా చేసింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఈ విషయం గురించి షా స్నేహితుడు సురేంద్ర స్పందించాడు. తమ వద్ద నుంచి రూ. 50 వేలు డిమాండ్ చేసిందని అతడు తెలిపాడు. ఒక వేళ ఆ డబ్బును తాము ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెడతామని బెదిరించిందని చెప్పాడు. ఇక చేసేదేమి లేక నిందితులపై షా స్నేహితుడు ముంబయి ఓషివారా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. హోటల్ సిబ్బందిని విచారించి నిందితుల్లో ఇద్దరైన సనా అలియాస్ సప్నా గిల్తో పాటు శోభిత్ ఠాకుర్ను అదుపులోకి తీసుకున్నారు. అంతే కాకుండా ఎనిమిది మందిపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.