కరోనా సంక్షోభం కారణంగా ఈ సీజన్ మహిళల టీ20 ఛాలెంజ్ నిర్వహించడం కష్టమేనని ఓ బీసీసీఐ అధికారి తెలిపారు. రద్దు చేసే యోచనలో బోర్డు ఉన్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని చెప్పారు.
"దీనిపై ప్రస్తుతానికి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటాం. సెకండ్ వేవ్ కారణంగా ప్రయాణ ఆంక్షలు, విమాన సర్వీసులు రద్దు వల్ల విదేశీ ఆటగాళ్లు ఇందులో పాల్గొనడం కష్టం అవుతుంది. ప్రతిఒక్కరి సురక్షితమే ప్రథమ బాధ్యత. కాబట్టి ఈ సారి టోర్నీని రద్దు చేసి.. వచ్చే సీజన్లో నిర్వహించవచ్చు" అని అన్నారు.
తొలుత ఈ ఏడాది ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ నాలుగు జట్లతో నిర్వహించాలని భావించారు. కానీ కరోనా కారణంగా ఎప్పటిలాగే మూడు టీమ్లతో ఈ సీజన్ టోర్నీ కొనసాగించనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఇటీవల వెల్లడించింది. కానీ వైరస్ వ్యాప్తి మరింత ఉద్ధృతమైన నేపథ్యంలో టోర్నీనే రద్దు చేసే యోచనలో ఉంది.