మహేంద్ర సింగ్ ధోనీలా ఆడే సాహసం ఎవరూ చేయలేరని రాజస్థాన్ రాయల్స్ బ్యాట్స్మన్ సంజూ శాంసన్ అన్నాడు. ఇటీవలే చెన్నై, పంజాబ్లతో జరిగిన మ్యాచ్ల్లో అద్భుత ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అతడిని అభినందించారు. భారత క్రికెట్లో తర్వాతి ధోనీ అవుతాడని అతడికి ఎప్పుడో చెప్పానని ట్వీట్ చేశారు. అయితే, థరూర్ అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్తో పాటు శ్రీశాంత్ వ్యతిరేకించారు. శాంసన్కు మరొకరిలా అవ్వాల్సిన అవసరం లేదని.. అతనెప్పుడూ భారత క్రికెట్లో సంజూ శాంసన్గానే ఉండాలని గౌతీ తెలిపాడు. తాజాగా సంజు ఈ విషయంపై తన అభిప్రాయాలు వెల్లడించాడు.
"ధోనీలా ఎవ్వరూ ఆడలేరు. అతనిలా ఆడేందుకు ఎవరూ ధైర్యం కూడా చేయరని అనుకుంటున్నా. మహీలా ఆడటం అంత సులువు కాదు. కాబట్టి, ఈ విషయాన్ని పక్కన పెట్టేయండి. అతను భారత క్రికెట్ లెజెండ్. నా ఆటమీద మాత్రమే నేను దృష్టి సారిస్తా. అత్యుత్తమంగా ఎలా ఆడాలి.. ఎలా మ్యాచ్ను గెలిపించాలి అనే కోణంలోనే ఎక్కువగా ఆలోచిస్తా."
-సంజూ శాంసన్, రాజస్థాన్ క్రికెటర్
రెండు మ్యాచ్ల్లో 74, 85 పరుగులతో టీమ్ఇండియా సెలక్షన్ కమిటీ దృష్టిని ఆకర్షించాడు సంజు. "నేను ఆ విధంగా చేయొచ్చు, చేసుండకపోవచ్చు. కానీ నేను మంచి ఫామ్లో ఉన్నా. నేను ఆడిన జట్టును గెలిపించడమే నా లక్ష్యం. అది ఏ జట్టైనా సరే. ప్రస్తుతం ఐపీఎల్ మీద దృష్టి పెట్టా" అని సంజు పేర్కొన్నాడు.