పంజాబ్పై క్రిస్గేల్ సిక్సర్ల తాండవం చేస్తే.. ముంబయి ఓపెనర్ క్రిస్లిన్ రాజస్థాన్కు మెరుపు ఆరంభం ఇస్తే.. ఇమ్రాన్ తాహిర్ చెన్నై నుంచి పంజాబ్కు మారథాన్ చేస్తే? అన్నింట్లోనూ ఒక పోలిక ఉంది. అది ఏంటో కనిపెట్టారా? వాళ్లు వాళ్ల సొంత జట్లకు ప్రత్యర్థులుగా మారనున్నారు. అదెలా అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. నిజమే. అచ్చంగా పైన చెప్పినట్లే కాకపోయినా.. చాలా మంది టీ20 స్పెషలిస్టులు తమ జెర్సీలు మార్చుకోనున్నారు. సొంత జట్లకే ప్రత్యర్థులుగా మారనున్నారు. మిడ్సీజన్ బదిలీల పేరుతో బీసీసీఐ ఆయా జట్లకు ఆటగాళ్ల మార్పిడి అవకాశం కల్పించనుంది.
అసలేంటీ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్?
ఆయా ఫ్రాంచైజీలు ప్రత్యర్థి జట్లలో నచ్చిన ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవచ్చు. అవసరం లేదనుకున్న ఆటగాళ్లను తమ జట్టు నుంచి వదులుకోవచ్చు. ఇదే ఈ ప్రక్రియ సారాంశం. గతంలో ఇలాంటి ప్రక్రియ చేపట్టినప్పటికీ అప్పటి నిబంధనల వల్ల అది సత్ఫలితం చూపించలేకపోయింది. ఒక్కమ్యాచ్ కూడా ఆడని ఆటగాళ్లనే బదిలీలకు అనుమతించడం వల్ల ఫ్రాంచైజీలు కొత్త ఆటగాళ్లను తీసుకునేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ, ఇప్పుడు మ్యాచ్లో ఆడని ఆటగాళ్లతో పాటు ఆడిన ఆటగాళ్లను కూడా బదిలీ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. దీంతో ఆయా జట్లలో కీలక ఆటగాళ్లు ఇతర జట్లకు బదిలీ కానున్నారు.
ఎప్పుడు?
టీ20 లీగ్ 13వ సీజన్ దాదాపు సగం పూర్తి కావచ్చింది. ప్లేఆఫ్కు వెళ్లేందుకు ఆయా జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ జట్లకు బీసీసీఐ మంచి అవకాశం కల్పించనుంది. తమ జట్లలోని ఆటగాళ్లను మార్చుకునే వెసులుబాటును కల్పిస్తోంది. ఈ సోమవారం ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నారు. దీంతో టోర్నీ మరింత ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది. ఆదివారం జరిగే రెండు మ్యాచ్ల తర్వాత సీజన్ సగం పూర్తవుతుంది. అందుకే ఆ తర్వాతి రోజు ఈ మిడ్ సీజన్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ చేపట్టనున్నారు.
ఎలా సాగుతుంది?
ఏదైనా జట్టు తమ జట్టులోని ఒక ఆటగాడిని బదిలీకి పెడుతున్నాం అని ప్రకటిస్తుంది. ఆ ఆటగాడిపై ఇతర జట్ల ఫ్రాంచైజీలకు ఆసక్తి ఉంటే అతడ్ని ఆ జట్టులోకి తీసుకుంటాయి. ఉదాహరణకు ముంబయి బ్యాటింగ్ లైనప్ ఇప్పటికే దృఢంగా ఉంది కాబట్టి క్రిస్లిన్ను వదులుకోవడానికి ముంబయి సిద్ధపడిందనుకోండి. బ్యాటింగ్లో కాస్త బలహీనంగా ఉన్న చెన్నై లిన్ను తమ జట్టులోకి తీసుకోవచ్చు. అలాగే బౌలింగ్లో రాణించలేకపోతున్న పంజాబ్.. ముంబయి బౌలర్ మిచెల్ మెక్క్లెనాఘన్ను తీసుకోవచ్చు. అయితే ఈసారి.. క్రిస్గేల్, క్రిస్లిన్, అజింక్యా రహానె, మిచెల్ శాంట్నర్, ఇమ్రాన్ తాహిర్పై ఇతర ఫ్రాంచైజీలు మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు హైదరాబాద్ జట్టు సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ గాయంతో ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగాడు. దీంతో భువీ స్థానాన్ని మరో మంచి బౌలర్తో భర్తీ చేయాలని హైదరాబాద్ కసరత్తు చేస్తోంది.
నిబంధనలు
- ఈ ప్రక్రియకు ముందు ప్రతి జట్టు ఏడు మ్యాచులు పూర్తి చేసుకొని ఉండాలి
- ఈ సీజన్లో రెండు మ్యాచ్లకు మించి ఆడిన ఆటగాళ్లు ఇందుకు అనర్హులు
- కొత్త ధర ఉండదు. వేలం పాటలో వాళ్లకు దక్కిన ధర కొనసాగుతుంది
- విదేశీ ఆటగాళ్లతో పాటు భారత క్రికెటర్లు కూడా ఇందుకు అర్హులే.
బదిలీలకు అర్హులైన ఆటగాళ్లు
పంజాబ్: క్రిస్ గేల్, క్రిస్ జోర్డాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, కృష్ణప్ప గౌతమ్, మురుగన్ అశ్విన్, దీపక్ హుడా, పోరెల్, సిమ్రాన్ సింగ్, తాజిందర్ సింగ్, అర్ష్దీప్ సింగ్, దర్శన్ నల్కండే, విల్జోయెన్, హర్ప్రీత్ బ్రార్, జగదీషా సుచిత్, మన్దీప్ సింగ్.
ముంబయి: మిచెల్ మెక్క్లెనాఘన్, క్రిస్ లిన్, కౌల్టర్ నైల్, ఆదిత్య తారె, సౌరభ్ తివారి, ధవల్ కులకర్ణి, రూథర్ఫర్డ్, అనుకుల్ రాయ్, మొసిన్ ఖాన్, దిగ్విజయ్ దేశ్ముఖ్, ప్రిన్స్ బల్వంత్ రాయ్, జయంత్ యాదవ్, అన్మోల్ప్రీత్ సింగ్
హైదరాబాద్: మహ్మద్ నబీ, విజయ్ శంకర్, సందీప్ శర్మ, వృద్ధిమాన్ సాహ, శ్రీవాత్సవ్ గోస్వామి, సిద్ధార్థ్ కౌల్, విరాట్ సింగ్, సందీప్ బవనాక, అలెన్, సంజయ్ యాదవ్, థంపి, స్టాన్లేక్, షాబాజ్ నదీమ్.
చెన్నై: మిచెల్ శాంట్నర్, శార్దుల్ ఠాకూర్, ఇమ్రాన్ తాహిర్, కరణ్శర్మ, కె.ఎమ్.ఆసిఫ్, నారాయణ్ జగదీశన్, మోను కుమార్, రుతురాజ్ గైక్వాడ్, రాయ్ కిషోర్, జోష్ హెజిల్వుడ్
దిల్లీ: అజింక్య రహానె, ఇశాంత్ శర్మ, కీమో పాల్, మోహిత్ శర్మ, అలెక్స్ కేరీ, సందీప్ లామిచానే, అవేశ్ ఖాన్, హర్షల్ పటేల్, లలిత్ యాదవ్, డేనియల్ సామ్స్, తుషార్ దేశ్పాండే.
కోల్కతా: ఫెర్గుసన్, టామ్ బాంటన్, నిఖిల్ నాయక్, ప్రసిద్ కృష్ణ, రింకు సింగ్, సందీప్ వారియర్, సిద్ధేశ్ లాడ్, క్రిస్ గ్రీన్, సిద్ధార్థ్.
రాజస్థాన్: డేవిడ్ మిల్లర్, ఆండ్రూ టై, వరుణ్ ఆరోన్, కార్తీక్ త్యాగి, ఓషనే థామస్, అనిరుద్ధ జోషి, ఆకాష్ సింగ్, అనుజ్ రావత్, యశస్వీ జైస్వాల్, మయాంక్ మార్కండే, అంకిత్ రాజ్పుత్, మనన్ వోహ్రా, మహిపాల్ లోమ్రోర్, శశాంక్ సింగ్
బెంగళూరు : క్రిస్ మోరిస్, డేల్ స్టెయిన్, మొయిన్ అలీ, జోష్ ఫిలిప్, షాబాజ్ అహ్మద్, పవన్ దేశ్పాండే, ఆడమ్ జంపా, గుర్కీరత్ సింగ్ మన్, మహ్మద్ సిరాజ్, పార్థివ్ పటేల్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్.