పాకిస్థాన్ సెలెక్టర్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు ఆ దేశ మాజీ క్రికెటర్ ఆకిబ్ జావెద్(Aaqib Javed). పాక్ టీమ్లో ఆటగాళ్ల కంటే ఎక్కువగా రెజ్లర్లనే చూస్తున్నాని ఎద్దేవా చేశాడు. ఫిట్నెస్కు ఏ మాత్రం ప్రాధాన్యమివ్వకుండా.. బయటకు బలంగా కనపడుతున్న ఆటగాళ్లను మాత్రమే ఎంపిక చేశారని ఆరోపించాడు.
ఇటీవలే ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో పాకిస్థాన్ ఓటమి పాలైంది. దీనిపై స్పందించాడు ఆకిబ్. ఇంగ్లాండ్తో సిరీస్ విషయంలో పాక్ సెలెక్టర్లకు, ఆటగాళ్లకు సరైన ప్రణాళికలు లేవన్నాడు. పక్కా ప్రణాళికతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. యువ ఆటగాళ్లతోనూ సిరీస్ గెలిచిందని చెప్పాడు.
"ఇంగ్లాండ్తో సిరీస్ కోసం జట్టు ఎంపికలో పాక్ సెలెక్టర్లకు సరైన ప్రణాళికలు లేవు. వారేం చేస్తున్నారో వారికే తెలియడం లేదు. ప్రస్తుత జట్టులో ఆటగాళ్ల కంటే రెజ్లర్లనే ఎక్కువ చూస్తున్నా. షార్జిల్ ఖాన్, అజామ్ ఖాన్, సోహైబ్ మక్సూద్ వంటి ఆటగాళ్ల ఫిట్నెస్.. అంతర్జాతీయ మ్యాచ్లు ఆడటానికి పనికొస్తుందా?"
-ఆకిబ్ జావెద్, పాకిస్థాన్ మాజీ క్రికెటర్.
ప్రస్తుతం పరిమిత ఓవర్ల సిరీస్ కోసం ఇంగ్లాండ్లో పర్యటిస్తోంది పాకిస్థాన్. ఇప్పటికే 3-0తో వన్డే సిరీస్ను ఇంగ్లాండ్ క్లీన్స్వీప్ చేయగా.. ఇక మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.
ఇదీ చదవండి: దాదాను స్లెడ్జ్ చేయడానికి.. బాత్రూమ్ నుంచి పరిగెత్తి!