క్రికెట్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ అంటే చాలా కిక్ ఉంటుంది. దీనిని ప్రపంచకప్ మ్యాచ్ అంతటి పోటీగా భావిస్తారు. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల కారణంగా టోర్నీలు జరగట్లేదు. కానీ అప్పట్లో ఈ రెండు జట్లు తలపడితే అభిమానుల సంతోషానికి అవధులు ఉండేవి కావు. అయితే ఈ రెండు జట్ల మధ్య పోటీ ఎలా ఉన్నా.. ఆటగాళ్లు మాత్రం సరదాగా ఉండేవారు. ఇదే విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు పాక్ మాజీ ఆటగాడు యాసిర్ అరాఫత్. గంగూలీ తన పెళ్లికి వచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు.
"సౌరభ్ గంగూలీ చాలా మర్యాదపూర్వక వ్యక్తి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే దాదా నా వివాహానికి హాజరయ్యారు. నా పెళ్లికి చాలామంది క్రికెటర్లను ఆహ్వానించా కానీ కొంతమందే వచ్చారు. గంగూలీకి ఈ విషయం తెలపగానే సానుకూలంగా స్పందించారు. ఆ సమయంలో ఆయన బిజీగా ఉన్నా.. నా పెళ్లి వేడుకకు వచ్చారు."
-అరాఫత్, పాక్ మాజీ క్రికెటర్
అలాగే ఐపీఎల్లో కోల్కతా నైడ్రైడర్స్కు ఆడాలని షారుక్ ఖాన్ ఆహ్వానించిన విషయాన్ని ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు అరాఫత్. తన కోసం ఇంగ్లాండ్కు ఓ గూఢాచారిని కూడా పంపాడని తెలిపాడు. తన ప్రదర్శనను, గణాంకాలను అంచనా వేయడానికి ఈ విధంగా చేయడానికి షారుక్ ఇలా చేశాడని వెల్లడించాడు. కానీ తాను ఇదంతా కామెడీ అనుకున్నానని పేర్కొన్నాడు.
"ఐపీఎల్ మొదటి ఎడిషన్లో నేను పాల్గొనలేదు. రెండో ఎడిషన్ ప్రారంభానికి ముందు కోల్కతా నైట్రైడర్స్ నాకోసం ఓ అధికారిని ఇంగ్లాండ్ పంపించింది. తాను నా ప్రదర్శనను అంచనా వేస్తానని చెప్పాడు. అలాగే షారుక్ నన్ను గమనిస్తున్నాడని, నా గణాంకాల్ని పరిశీలిస్తున్నాడని తెలిపాడు. నేను అదేదో కామెడీకి చేస్తున్నారని అనుకున్నా. తాను నాకు ఒక కార్డు కూడా ఇచ్చాడు. కానీ దానికి నేను స్పందించలేదు. ఆ తర్వాత నాకు ఇండియా నుంచి ఓ కాల్ వచ్చింది. అప్పుడు ఇదంతా నిజమని నమ్మా. తర్వాత రోజు షారుక్ కాల్ చేసి 'కేకేఆర్ జట్టులోని నిన్ను ఆహ్వానిస్తున్నాం' అన్నారు. తాను నాకోసం లండన్ వచ్చి కాంట్రాక్ట్ ఇచ్చారు" అని అరాఫత్ అప్పటి విషయాల్ని పంచుకున్నాడు.