వచ్చే నెల ఇంగ్లాండ్తో జరగనున్న టీ20, వన్డే సిరీస్లకు భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. ఆటగాళ్లపై అదనపు భారం తగ్గించే విషయంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.
"గత ఆస్ట్రేలియా సిరీస్ నుంచి స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన మొదటి టెస్టు వరకు బుమ్రా దాదాపు 150 ఓవర్లు వేశాడు. తదుపరి మొతెరాలో జరుగనున్న టెస్టుల్లోనూ అతను పాల్గొననున్నాడు. ఈ రెండు మ్యాచ్ల్లో జస్సీ ప్రధాన పాత్ర పోషించనున్నాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల క్రికెట్కు అతనికి విశ్రాంతిని ఇవ్వాలనుకుంటున్నాం" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ ఏడాది జరిగే టీ-20 ప్రపంచకప్ ముందు.. భారత్ ఆడే చివరి సిరీస్ ఇంగ్లండ్తోనే. ఇందులో 3 వన్డేలు, 5 టీ-20లు ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే బుమ్రాకు విశ్రాంతి ఇచ్చి.. అతని స్థానంలో నటరాజన్, సైనీ వంటి యువబౌలర్లను పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఇంగ్లండ్తో టెస్టు సిరీస్లో తొలి మ్యాచ్ అనంతరం.. బుమ్రాకు విశ్రాంతినిచ్చింది. భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీలు ఇంగ్లాండ్తో సిరీస్ కోసం తిరిగి జట్టులోకి తీసుకోనున్నారు. ఐపీఎల్లో ముంబయి తరఫున బుమ్రా ఎటూ 14 నుంచి 16 వరకు మ్యాచ్లు ఆడనున్నాడు. ఏదేమైనా బుమ్రా విశ్రాంతిపై.. తుది నిర్ణయం మాత్రం కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ కోహ్లీ, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్లపై ఆధారపడి ఉండనుంది.
అశ్విన్ను తీసుకొనేనా..
ఇండియా తరఫున టెస్టుల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ను.. ఇంగ్లాండ్తో టీ20, వన్డే సిరీస్లకు తీసుకునే అవకాశం ఉంది. 2020 ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్కు ఆడిన యాష్.. అంచనాల మేరకు రాణించాడు. ప్రస్తుతం అశ్విన్కు చాహల్, కుల్దీప్ యాదవ్ల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుంది. చాలా కాలంగా అశ్విన్ వైట్ బాల్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు.
2011లో ఇలాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో స్థానం కోసం ఇబ్బందిపడిన రాహుల్ ద్రవిడ్.. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టాడు. టెస్టుల్లో అద్భుతంగా ఆడిన ద్రవిడ్ను వన్డేలకు తీసుకున్నారు. అయితే.. ఆ తర్వాత తన స్థానం విషయంలో అనిశ్చితి నెలకొన్న తరుణంలో రిటైర్మెంట్ ప్రకటించాడు.
సూర్యకుమార్కూ అవకాశం..
ముంబయి తరఫున ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తున్న యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్నూ.. ఇంగ్లాండ్తో సిరీస్లకు తీసుకునే అవకాశం ఉంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పర్యటనలకూ అతడిని ఎంపిక చేయలేదు. దీనిపై విమర్శలు వచ్చాయి. రానున్న టీ20 ప్రపంచ కప్ కోసం ఇతనికి ఓ అవకాశం ఇచ్చే యోచనలో యాజమాన్యం ఉంది. కేఎల్ రాహుల్, రిషభ్ పంత్లు ఇద్దరూ వికెట్ కీపింగ్ చేస్తుండటంతో.. సంజు శాంసన్ కంటే సూర్యకుమార్నే ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఇదీ చదవండి: గంగూలీ, జై షా పిటిషన్పై 23న విచారణ