ప్రస్తుతానికైతే ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్ వివోతో తెగదెంపులు చేసుకునే అవకాశాలు లేవని బీసీసీఐ కోశాధికారి అరుణ్ ధుమాల్ స్పష్టం చేశాడు. తదుపరి ఒప్పందం కోసం స్పాన్సర్షిప్ విధానంపై సమీక్ష నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగానే ఉందని, కానీ ప్రస్తుతం భారత ఆర్థికాభివృద్ధికి సాయంగా నిలుస్తున్న చైనా సంస్థ వివోతో సంబంధాన్ని ముగించలేమని అతనన్నాడు.
గల్వాన్ లోయలో చైనా సైనికులతో ఘర్షణ కారణంగా భారత జవాన్లు మరణించడం వల్ల ఆ దేశ ఉత్పత్తులను బహిష్కరించాలనే నినాదం జోరందుకుంది. ఏడాదికి రూ.440 కోట్లు చెల్లించేలా బీసీసీఐ వివోతో కుదుర్చుకున్న అయిదేళ్ల ఒప్పందం 2022లో ముగుస్తుంది.
"మీరు ఎప్పుడైతే భావోద్వేగంతో మాట్లాడతారో.. అప్పుడు హేతుబద్ధతను పక్కకు పెట్టేస్తారు. చైనా కోసం ఆ దేశ సంస్థకు మద్దతివ్వడం లేదా భారత ప్రయోజనాల కోసం చైనా సంస్థ నుంచి సాయం పొందడం మధ్య తేడాను అర్థం చేసుకోవాలి. తమ ఉత్పత్తుల ద్వారా భారత్లో సంపాదించిన డబ్బును చైనా సంస్థలు బీసీసీఐ (బ్రాండ్ ప్రచారంలో భాగంగా)కి చెల్లిస్తున్నాయి. ఆ డబ్బుపై బోర్డు 42 శాతం పన్ను భారత ప్రభుత్వానికి కడుతోంది. అది భారత్కు మేలు చేసినట్టు కానీ చైనాకు కాదు" అని అరుణ్ పేర్కొన్నాడు.