వికెట్లు పడుతున్నా పరుగులెలా చేయాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లకు సూచించాడు. ఇంగ్లాండ్తో మూడో టీ20లో కెప్టెన్ ఇన్నింగ్స్ అద్భుతమని ప్రశంసించాడు. ఒక పక్క భాగస్వామ్యాలు నిర్మిస్తూనే స్కోరు వేగం పెంచాడని తెలిపాడు. ఈ మ్యాచులో తొలి 29 బంతుల్లో 28 పరుగులు చేసిన విరాట్ తర్వాత 17 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు.
"ఒకానొక దశలో టీమ్ఇండియా కనీసం 140 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది. ఎందుకంటే మొదట్లోనే ఎక్కువ వికెట్లు పడ్డాయి. కానీ కోహ్లీ విజృంభించాడు. ఛేదన రారాజు ఆదివారమే తన మాయాజాలం ప్రదర్శించినా మూడో టీ20లో ఇన్నింగ్స్ మాత్రం అత్యంత గొప్పది. తొలుత ఒత్తిడిని అధిగమించాడు. భాగస్వామ్యాలు నిర్మించాడు. తర్వాత దూకుడుగా ఆడాడు. ఒత్తిడిలో బ్యాటింగ్ ఎలా చేయాలో? పరుగులు ఎలా సాధించాలో? అతడిని చూసి యువకులు నేర్చుకోవాలి."
-లక్ష్మణ్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్
"విరాట్ క్రీజులోకి వచ్చినప్పుడు 3 వికెట్లు పడ్డాయి. భాగస్వామ్యాల అవసరం ఏర్పడింది. తొలుత పంత్ తర్వాత శ్రేయస్, హార్దిక్ పాండ్యాతో భాగస్వామ్యాలు నిర్మించాడు. అతడు క్రీజును ఉపయోగించుకొన్న విధానం నాకెంతో నచ్చింది. ఫీల్డర్ల మధ్య అంతరాలు ఎక్కడున్నాయో అతడికి తెలుసు. అందుకే అక్కడే షాట్లు ఆడాడు. కేవలం ఫోర్లే కాదు సిక్సర్ల వర్షమూ కురిపించాడు" అని లక్ష్మణ్ ప్రశంసించాడు.
పరిస్థితులను అర్థం చేసుకున్న కోహ్లీ తొలుత గాల్లోకి షాట్లు ఆడలేదని వీవీఎస్ తెలిపాడు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ బౌండరీలు, సిక్సర్లను మైదానం మొత్తం బాదేశాడన్నాడు. ఆఖర్లో మార్క్వుడ్, ఆర్చర్, జోర్డాన్ బౌలింగ్లో దూకుడు కొనసాగించడాన్ని తాను ఎంతగానో ఆస్వాదించానని లక్ష్మణ్ వెల్లడించాడు.