రోహిత్ శర్మ 'సిక్సర్' బాదేస్తాడని ముంబయి ఇండియన్స్ యువ స్పిన్నర్ రాహుల్ చాహర్ అంటున్నాడు. అయితే అది బంతితో కాదని, ఐపీఎల్ టైటిళ్ల సిక్సరని పేర్కొన్నాడు. తమ ఆటగాళ్లు ప్రస్తుతం అత్యుత్తమ ఫామ్లో ఉన్నారని ధీమా వ్యక్తం చేశాడు. సీనియర్లు, జూనియర్లు, కోచింగ్ బృందం పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్నారని వెల్లడించాడు.
"ముంబయి ఇండియన్స్ తరఫున మరోసారి రాణించేందుకు ఎదురుచూస్తున్నా. మాకు మంచి కోచింగ్ బృందం ఉంది. జహీర్ ఖాన్, జయవర్దనె వద్ద క్రికెట్ పాఠాలు నేర్చుకోవడం నా అదృష్టం. ఇక ముంబయి ఆరో టైటిల్ కొడుతుందన్న ఆత్మవిశ్వాసం ఉంది. బ్యాట్స్మెన్ ఉత్తమ ఫామ్లో ఉన్నారు. రోహిత్, హార్దిక్, కృనాల్, సూర్యకుమార్, ఇషాన్తో జట్టు దుర్భేద్యంగా ఉంది. వరుసగా మూడోది, మొత్తంగా ఆరో ట్రోఫీ అందుకోవడంలో సందేహమే లేదు. టైటిళ్లతో రోహిత్ భయ్యా సిక్సర్ కొట్టేస్తాడు" అని రాహుల్ చాహర్ అన్నాడు.
"రోహిత్ భయ్యా, హార్దిక్, పొలార్డ్ మా జట్టులో స్టార్ ఆటగాళ్లు. ఏ పరిస్థితుల్లోనైనా వారు ఆటను మార్చేస్తారు. ఈ ముగ్గురే కాకుండా సూర్య, ఇషాన్ మాకు కీలకం. వారిప్పుడు అద్భుత ఫామ్లో ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత టీమ్ఇండియాలో పునరాగమనం చేశా. కొన్ని విభాగాల్లో నా ఆటను మెరుగుపర్చుకుంటున్నా. భారత్కు మూడు ఫార్మాట్లలో ఆడాలన్నది నా కోరిక. జహీర్ సర్ నా బౌలింగ్ను మరో స్థాయికి తీసుకెళ్లారు" అని చాహర్ తెలిపాడు.
రాహుల్ 2017లో ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు. కేవలం 3 మ్యాచులే ఆడాడు. ఆ తర్వాత సీజన్ నుంచి ముంబయి ఇండియన్స్లో కీలకంగా మారాడు. నిలకడగా రాణిస్తున్నాడు. పరుగులను నియంత్రిస్తూ వికెట్లు తీస్తున్నాడు. 2019, 2020లో ట్రోఫీలు గెలవడంలో రాహుల్ తన బౌలింగ్తో కీలకంగా మారాడు.
ఇదీ చూడండి: 'ఎలా ఆడాలో.. కోహ్లి, రోహిత్ల నుంచి నేర్చుకుంటా'