కరోనా కారణంగా క్రికెట్ మ్యాచ్లు నిర్వహించాలంటే సురక్షిత వాతావరణం కచ్చితంగా అవసరం. అందుకే బయో సెక్యూర్ బబుల్ విధానంలో టోర్నీలు నిర్వహించడానికి మొగ్గుచూపుతున్నారు. తాజాగా ఐపీఎల్ కూడా ఇదే విధానంలో యూఏఈ వేదికగా జరగనుంది. అందుకోసం ఆటగాళ్లందరూ ఆ బుడగ లోపలే ఉండాల్సి వస్తుంది. అందువల్ల ఆటగాళ్లకు కాస్త బోర్ కొట్టే అవకాశం ఉంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేయండంటూ క్రికెటర్లకు కొన్ని సలహాలు ఇచ్చాడు ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ.
"మొదటగా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే భౌతిక దూరం పాటిస్తూ, కరోనా నిబంధనలు పాటించాలి. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఐపీఎల్ జరగాలని కోరుకుంటున్నారు. ఈ ఆటను వారు చాలా మిస్సవుతున్నారు. ఇది ఎనిమిది నుంచి తొమ్మిది వారాల టోర్నీ. రూమ్ల్లో ఉండి ఆటగాళ్లకు బోర్ కొట్టే అవకాశం ఉంది. అందువల్ల గిటార్ నేర్చుకోండి. నేను అయితే అదే చేస్తా. ఈ పరిస్థితుల్లో బయటకెళ్లి గోల్ఫ్ ఆడలేను. అందుకే గిటార్ వాయిస్తూ.. కార్డ్స్ ఆడుకుంటా."
-బ్రెట్ లీ, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఐపీఎల్ 13వ సీజన్ సెప్టెంబర్ 19న ప్రారంభంకానుంది. నవంబర్ 10 వరకు ఈ టోర్నీ జరగబోతుంది. ఈ సీజన్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.