ఆస్ట్రేలియా హెడ్కోచ్ జస్టిన్ లాంగర్తో పలువురు ఆటగాళ్లకు విభేదాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. అక్కడి ప్రముఖ వార్త సంస్థ ఒకటి ఈ విషయాన్ని పేర్కొంది. కోచ్ వ్యవహారశైలితో ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారని, జట్టుతో లాంగర్ సరిగా వ్యవహరించడం లేదని చెప్పింది. దాంతో పాటు కొందరు సీనియర్ ఆటగాళ్లు కూడా లాంగర్ పట్ల అసంతృప్తితో ఉన్నారని రాసుకొచ్చింది.
ఎప్పుడూ ఆటగాళ్లు తమ తిండి విషయాలను గమనించడానికి ఒకరు కావాలనుకుంటే.. అప్పుడు తన పని తాను చేసినట్లు కాదని లాంగర్ పేర్కొన్నట్లు వివరించింది. బౌలింగ్ వ్యవహారాల్లో తాను కలుగజేసుకోకపోవడంపై స్పందిస్తూ.. "నేనెప్పుడూ బౌలర్ల గణంకాల గురించి మాట్లాడను. ఎప్పుడూ బౌలర్ల సమావేశానికి హాజరుకాను. బౌలింగ్ కోచ్ ఉండేదే అందుకు. అయితే, కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే ఆ విషయాలపైనా కన్నేయాల్సి వచ్చింది’ అని ఆసీస్ కోచ్ వ్యాఖ్యానించాడు.
ఇటీవల గబ్బా టెస్టులో తమ ఆటగాడొకరు మైదానంలో తినేందుకు జేబులో సాండ్విచ్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడని, దాంతో అతడిని అలా చేయొద్దని చెప్పినట్లు లాంగర్ అసలు విషయం తెలిపాడు. గత అనుభవాల దృష్ట్యా ఆస్ట్రేలియా ఆటగాళ్లపై నిరంతరం కెమెరాల నిఘా ఉంటుందని, జేబులో ఏదైనా ఉంటే అది ప్రజల్లోకి వేరే విధంగా వెళ్లే ప్రమాదం ఉన్నట్లు అతడికి వివరించానని ఆసీస్ కోచ్ తెలిపాడు. దీన్ని ఎలా సమర్థించుకుంటావని ఆ ఆటగాడిని నిలదీసినట్లు లాంగర్ స్పష్టం చేశాడు. టీమ్ఇండియాతో టెస్టు సిరీస్ కోల్పోయాక ఆ జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజా వివాదం ఎక్కడికి దారి తీస్తుందో వేచి చూడాలి. అయితే, ఈ విభేదాలను ఆటగాళ్లు జట్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లలేదని ఆ కథనంలో పేర్కొనడం గమనార్హం.
ఇదీ చూడండి: 'ఐపీఎల్ వల్లే భారత ఆటగాళ్లకు గాయాలు'