న్యూజిలాండ్ పేసర్ జేమ్స్ నీషమ్ ఆరేళ్ల కిందట ఐపీఎల్ ఆడాడు. 2014లో దిల్లీ తరఫున పలు మ్యాచ్లు ఆడిన అతడు తర్వాత మళ్లీ మెగా టోర్నీలో అడుగుపెట్టలేదు. ఇన్నేళ్ల తర్వాత ఈసారి కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ తరఫున బరిలో దిగనున్నాడు. ప్రస్తుతం దుబాయ్లో జట్టుతో ఉన్న అతడు తాజాగా మీడియాతో మాట్లాడాడు.
"ఈసారి పంజాబ్ కచ్చితంగా విజయం సాధిస్తుంది. సుదీర్ఘ టోర్నీ ఆడటం నాకిదే తొలిసారి. పాత ఆటగాడిగా, అనుభవం కలిగిన బౌలర్గా మళ్లీ ఐపీఎల్లో ఆడటం సంతోషంగా ఉంది. అందుకోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. గతంలో దిల్లీ తరఫున ఆడా. అయితే, అప్పుడెలా ఆడాలనే విషయంపై స్పష్టమైన అవగాహన లేక ఇబ్బందులు పడ్డా."
-జేమ్స్ నీషమ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రికెటర్
ఈసారి స్పష్టమైన ప్రణాళికతో బరిలోకి దిగబోతున్నట్లు తెలిపాడు నీషమ్. తన అనుభవాన్ని, జ్ఞానాన్ని ఇతరులతో పంచుకుంటానని చెప్పాడు. తమ జట్టులో క్రిస్ గేల్, మాక్స్వెల్ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, దాంతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ కచ్చితంగా విజేతగా నిలుస్తుందనే ధీమా వ్యక్తం చేశాడు.
ఈసారి టీమ్ఇండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే పంజాబ్ జట్టుకు ప్రధాన కోచ్గా వ్యవహరిస్తున్నాడు. కేఎల్ రాహుల్ కెప్టెన్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ప్రస్తుతం కింగ్స్ ఆటగాళ్లు తీవ్రంగా సాధన చేస్తున్నారు. మరి ఈసారైనా పంజాబ్కు కలిసొస్తుందో చూడాలి.