ఈ ఏడాది ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఫ్రాంచైజీల్లో ప్రస్తుతం అనిశ్చితి నెలకొంది. ఇటీవలే కరోనా పరీక్షలు నిర్వహించగా.. చెన్నై సూపర్కింగ్స్ జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బందికి పాజిటివ్ నిర్ధరణ అయినట్లు బీసీసీఐ తెలిపింది. దీంతో ఐపీఎల్ షెడ్యూల్పై గందరగోళం ఏర్పడింది. సెప్టెంబరు 19న ప్రారంభ మ్యాచ్ను సీఎస్కే, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య నిర్వహించాలని బీసీసీఐ భావించింది.
అయితే, ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ జట్లతో మ్యాచ్ జరిపే అవకాశాలు కనిపించడం లేదు. సీఎస్కే ఆటగాళ్లకు పాజిటివ్ తేలినందున.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ను వేరే జట్టు ప్రారంభించే అవకాశాలున్నట్లు బోర్డు అధికారిక వర్గాలు తెలిపాయి.
"నాకు తెలిసి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)తో ప్రారంభ మ్యాచ్ జరగొచ్చు. ఎందుకంటే, తొలి మ్యాచ్లో స్టార్ ప్లేయర్లు మైదానంలో కనిపించడం అవసరం. ఇప్పుడు ధోనీతో కుదరకపోతే.. కోహ్లీ జట్టుతోనే ప్రారంభించే అవకాశం ఉంది. సీఎస్కే ప్రారంభ మ్యాచ్ను ఆడుతుందా లేదా అనే విషయంపై పాలక మండలి స్పష్టతనిచ్చే వరకు వేచి చూడాలి."
-బీసీసీఐ అధికారిక వర్గాలు
యూఏఈలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పలువురు ఆటగాళ్లు పేర్కొన్నారు. శిక్షణ పొందుతున్న సమయంలో ప్రాక్టీస్ వేదిక వద్ద లైట్లు ఆగిపోయాయని ఒక ఆటగాడు తెలిపాడు. జట్టు సిబ్బందికి ఇప్పటికీ ట్రాకింగ్ బ్యాండ్లు అందలేదని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. తమ సమస్యలను వినేందుకు బీసీసీఐకి సమయం దొరకడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.