కరోనా నేపథ్యంలో దేశంలో ఇప్పుడిప్పుడే క్రీడలు ప్రారంభమయ్యే అవకాశం లేదు. కాంట్రాక్టు క్రికెటర్లకు ఇప్పటివరకు శిక్షణా శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు బీసీసీఐ. ఆగస్టు రెండో వారం నుంచి ప్రాక్టీస్కు అనుమతి ఉంటుందని అంతా అనుకున్నారు. గుజరాత్ మొతేరా స్టేడియంలో ఐపీఎల్లో పాల్గొనే కాంట్రాక్ట్ ఆటగాళ్లందరికీ శిక్షణ కల్పించాలని భావించారు. కానీ ప్రస్తుతం అది సాధ్యమయ్యేలా లేదు.
క్రికెటర్లు వచ్చే నెల దుబాయ్ వెళ్లాక అక్కడే నేరుగా ప్రాక్టీస్ శిబిరాల్లో పాల్గొనే అవకాశం ఉంది. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న దృష్ట్యా బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
"ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొతేరా స్టేడియంలో ఆటగాళ్లకు శిక్షణా శిబిరాలు ప్రారంభమవుతాయని వార్తలు వస్తున్నాయి. కానీ మాకు ఇప్పటివరకు బీసీసీఐ నుంచి ఎటువంటి సమాచారం అందలేదు."
-గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అధికారి
ప్రస్తుత పరిస్థితుల్లో ఆటగాళ్ల ఆరోగ్య భద్రతకే బీసీసీఐ ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తోంది. వారి ఇళ్ల నుంచి అహ్మదాబాద్ వెళ్లి.. మళ్లీ అక్కడి నుంచి దుబాయ్కు చేరుకునే క్రమంలో ఎక్కువ రిస్క్ చేయాల్సి ఉంటుందని భావిస్తోంది. అందుకే దుబాయ్లోనే ఆటగాళ్ల ప్రాక్టీస్కు వీలుగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది