సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ మొదలుకానుంది. ఈ క్రమంలో సీఎస్కే యాజమాన్యం.. తమ జట్టులోని భారత క్రికెటర్ల కోసం చెన్నైలో ఆగస్టు 15-20 మధ్య శిక్షణా శిబిరం ఏర్పాటు చేసింది. ఇందులో ధోనీ, హర్భజన్ సింగ్, రైనా, అంబటి రాయుడు తదితరులు పాల్గొనుండగా.. జడేజా మాత్రం రాలేకపోతున్నట్లు వెల్లడించాడు. ఆగస్టు 21న దుబాయ్ వెళ్లే సమయానికి వస్తానని అతడు చెప్పినట్లు ఫ్రాంఛైజీ తెలిపింది.
ఈ క్యాంప్కు క్రికెటర్లతో పాటు బౌలింగ్ కోచ్ లక్ష్మీపతి బాలాజీ మాత్రమే హాజరు కానున్నాడు. బ్యాటింగ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, సహాయ కోచ్ మైకేల్ హస్సీ, సీఈఓ కాశీ విశ్వనాథన్.. జట్టు దుబాయ్ వెళ్లిన తర్వాత కలుస్తారు.
![CSK's pre-season camp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/thequint_2015-12_bb177d3f-dfdf-4680-bf84-336b94b2d964_dhoni-_1208newsroom_1597250089_925.jpg)
వీరితో పాటు దక్షిణాఫ్రికా క్రికెటర్లు డుప్లెసిస్, లుంగి ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్.. సెప్టెంబరు 1 తర్వాత దుబాయ్ వస్తామని చెప్పినట్లు విశ్వనాథ్ వెల్లడించారు.
యూఏఈ వేదికగా షార్జా, అబుదాబీ, దుబాయ్లోని స్టేడియాల్లో ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్లు జరగనున్నాయి. కరోనా ప్రభావం కారణంగా మైదానంలోకి ప్రేక్షకుల్ని ఎవరినీ అనుమతించరు.