కరీబియన్ జట్టుతో టీ20 పోరు రసవత్తరంగా సాగింది. ఇక ఆ జట్టుతో వన్డే సమరం మొదలు కాబోతోంది. జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకునే ప్రయత్నంలో ఉన్న కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. నిలకడగా ఆడలేకపోతున్న కేదార్ జాదవ్, రిషబ్ పంత్, మనీష్ పాండే.. కొత్తగా చోటు కోసం పోటీ పడుతున్న శివమ్ దూబె, మయాంక్ అగర్వాల్లకు ఈ సిరీస్ కీలకం కానుంది. లభించే అవకాశాల్ని వీరిలో ఎవరెలా ఉపయోగించుకుంటారో చూడాలి.
మయాంక్ ఉంటాడా?
ఫార్మాట్ ఏదైనా కొత్తగా జట్టులోకి వచ్చే ఆటగాళ్లను నేరుగా తుది జట్టులోకి తీసుకోకపోవడం టీమ్ఇండియా సంప్రదాయం. ఒకట్రెండు సిరీస్లో జట్టుతో పాటే ఉంచి ఆ తర్వాత అవకాశం ఇస్తుంటుంది జట్టు యాజమాన్యం. ఎప్పుడో ఒకసారి కొందరు ఆటగాళ్లు జట్టులోకి రావడంతోనే తుది జట్టులోనూ అవకాశం దక్కించుకుంటారు. మరి మయాంక్ అగర్వాల్ సంగతేంటో చూడాలి. రెగ్యులర్ ఓపెనర్ శిఖర్ ధావన్ గాయపడటంతో అనుకోకుండా మయాంక్కు వన్డే జట్టులో చోటు లభించింది. అతను ఇప్పటికే టెస్టు జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. వన్డేల్లో అవకాశం కోసం చూస్తుండగా.. ధావన్ గాయం వరంలా కలిసొచ్చింది. స్పెషలిస్టు ఓపెనర్ కావడం, ఫామ్లో ఉండటంతో మయాంక్కు కలిసొచ్చే అంశం. అయితే ప్రపంచకప్ మధ్యలో ధావన్ గాయపడటంతో రాహుల్ ఓపెనర్గా ఆడి సత్తా చాటాడు. ఇటీవల టీ20 సిరీస్లోనూ అతను ఓపెనర్గా రాణించాడు. కాకపోతే రాహుల్కు 3, 4 స్థానాల్లోనూ ఆడిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలో మయాంక్ను తుది జట్టులోకి తీసుకుంటే ఓపెనర్గా ఆడించి, రాహుల్ను దిగువకు పంపుతారా.. లేక రాహుల్నే రోహిత్కు జోడీగా పంపి, మయాంక్ను వేరే స్థానంలో ఆడిస్తారా అన్నది చూడాలి. మయాంక్ను పక్కన పెట్టి అలవాటైన కూర్పుతోనే కోహ్లి ముందుకు వెళ్లే అవకాశాలూ లేకపోలేదు. బ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానం కోహ్లీది కాగా.. నాలుగులో శ్రేయస్ అయ్యర్నే కొనసాగించే అవకాశముంది. అయ్యర్ నుంచి జట్టు మరింత నిలకడ ఆశిస్తోంది.
![formation in team India cricket make head ache.. who is got opportunity odi series against west indies](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5367592_mayank.jpg)
పంత్.. ఈసారి విఫలమైతే!
ఈ మధ్య కాలంలో నిలకడ లేమితో, తప్పిదాలతో ఎక్కువగా విమర్శలు ఎదుర్కొంటున్న ఆటగాడు రిషబ్ పంత్. కెరీర్ ఆరంభంలో మెరుపులతో ధోని వారసుడిగా గుర్తింపు పొందిన ఈ కుర్రాడు.. తర్వాత అవసరం లేని దూకుడుతో వికెట్ పారేసుకుంటూ, వికెట్ కీపింగ్లో తరచుగా తప్పిదాలు చేస్తూ తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్నాడు. ఇటీవల టీ20 సిరీస్లోనూ అతను పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. సంజు శాంసన్ను పక్కన పెట్టి మరీ అతడికి అన్ని మ్యాచ్ల్లోనూ అవకాశం ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయాడన్న విమర్శ ఉంది. అయితే వన్డే సిరీస్ జట్టులో పంత్కు ప్రత్యామ్నాయంగా ఇంకో వికెట్ కీపర్ బ్యాట్స్మన్ లేడు. కాబట్టి మూడు మ్యాచ్ల్లోనూ అతను ఆడతాడన్నమాటే. పంత్.. 5 లేదా 6 స్థానంలో బ్యాటింగ్కు దిగొచ్చు. అయితే ఈ సిరీస్లో పెద్ద ఇన్నింగ్స్ ఆడకుంటే మాత్రం పంత్ స్థానానికి ముప్పు తప్పదు.