ఇంగ్లాండ్ పర్యటనలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. ఇటు అంపైర్లు, అటు ప్రత్యర్థి ఆటగాళ్లతో తరచూ గొడవకు దిగుతున్నాడని, తన మాటలు, చేతల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఇంగ్లీష్ జట్టు మాజీ క్రికెటర్ డేవిడ్ లాయిడ్ మండిపడ్డాడు. అతడో అంతర్జాతీయ పత్రికకు రాసిన వ్యాసంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్తో మ్యాచ్ల సందర్భంగా టీమ్ఇండియా సారథి అంపైర్లకు గౌరవం ఇవ్వట్లేదని చెప్పాడు. డీఆర్ఎస్ విషయాల్లో ఒత్తిడి తెస్తున్నాడని పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్ల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్నాడని లాయిడ్ తీవ్ర విమర్శలు చేశాడు.
![David Lloyd slams Virat Kohli,](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/we-were-completely-outplayed-virat-kohli-blames-it-on-ineffective-bowling_0203newsroom_1614646641_508.webp)
'డేవిడ్ మలన్ క్యాచ్ ఉదంతం నేపథ్యంలో 'అంపైర్లపై ఇంగ్లాండ్ ఒత్తిడి తెస్తుంది' అని కోహ్లీ చేసిన వ్యాఖ్యల్లో నిజమెంతో నాకు తెలియదు. కానీ, కోహ్లీ మాత్రం వారిపై ఒత్తిడి తెస్తున్నాడు, వాళ్లను గౌరవించడం లేదు. ఈ పర్యటన మొత్తం వారితో విభేదిస్తున్నాడు. ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. మంగళవారం జరిగిన తొలి వన్డేలోనూ (బట్లర్తో వాగ్వాదం) అలాంటిదే జరిగింది. మైదానంలో ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగకూడదు. నోరు లేని ఐసీసీ కూడా ఏం చేయలేకపోయింది' అని లాయిడ్ తీవ్రంగా స్పందించాడు. కోహ్లీ ఇప్పుడున్న హోదాలో.. తను ఏం మాట్లాడినా, ఏం చేసినా అప్రమత్తంగా ఉండాలి. మరోవైపు ఆటగాళ్ల ప్రవర్తనపై అంపైర్లు తగిన చర్యలు తీసుకునేలా.. పసుపుపచ్చ, ఎర్ర రంగు కార్డులు అందజేయాలి. ఎందుకంటే అంపైర్లు ఇప్పుడు ఏ చర్య తీసుకునేలా కనిపించడంలేదు' అని లాయిడ్ పేర్కొన్నాడు.