ఐపీఎల్ వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా రికార్డు సృష్టించిన ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్.. వీక్షకులు లేకపోయినా ఐపీఎల్ ఆడేందుకు సిద్ధమని చెప్పాడు. ఇతడిని రూ.15.50 కోట్లకు సొంతం చేసుకుంది కోల్కతా నైట్రైడర్స్.
"ఎప్పుడైనా ఆటకంటే ఆరోగ్యమే ముఖ్యం. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలు జరగకపోతే చాలా బాధగా ఉంటుంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మార్పు వస్తే, ఖాళీ మైదానాల్లో మ్యాచ్లు ఆడేందుకైనా సిద్ధమే. అభిమానులు ఎలాగో టీవీల్లో మ్యాచ్లు చూడగలుగుతారు"
-ప్యాట్ కమిన్స్, ఆస్ట్రేలియా పేసర్
కరోనా ప్రభావంతో గత నెల 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్.. ఈనెల 15కు వాయిదా పడింది. వైరస్ తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా టోర్నీ జరిగే విషయమై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై బీసీసీఐ ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16లక్షల మందికి కరోనా సోకగా, 95వేల మందికి పైగా మరణించారు. భారత్లో 6 వేలమందికి పైగా వైరస్తో బాధపడుతుండగా, 199 మంది చనిపోయారు.