గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత నుంచి టీమిండియా మాజీ సారథి ధోనీ.. భారత జెర్సీ వేసుకోలేదు. అయితే దాదాపు 8 నెలల విరామం తర్వాత మళ్లీ ఐపీఎల్ కోసం ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో సుమారు రెండు వారాలుగా కసరత్తులు చేస్తున్నాడు.
కరోనా వైరస్ వ్యాప్తి, ఐపీఎల్ వాయిదా కారణంగా తాజాగా ప్రాక్టీస్ సెషన్ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది చెన్నై సూపర్కింగ్స్ యాజమాన్యం. రెండు వారాల తర్వాత మళ్లీ శిక్షణ మొదలవుతుందని అధికారికంగా వెల్లడించింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ ప్రపంచకప్లో చోటు దక్కించుకోవాలంటే ఐపీఎల్ కీలకం. ఇలాంటి సమయంలో మెగాటోర్నీ వాయిదా పడింది. ఒకవేళ ఈ లీగ్ రద్దయితే ధోనీ భవితవ్యం ఏంటన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అక్టోబర్ నుంచి మొదలయ్యే పురుషుల టీ20 ప్రపంచకప్ ముందు జరుగుతున్న ఏకైక టోర్నీ ఇదే. ఫలితంగా దీనిపై ధోనీ భారీగానే ఆశలు పెట్టుకున్నారు అభిమానులు. టీమిండియా సెలక్టర్లు ఈ టోర్నీలో ప్రదర్శన ఆధారంగా మహీకి జట్టులో చోటివ్వాలనే అభిప్రాయంతో ఉన్నట్లు సమాచారం. గతంలోనే కోచ్ రవిశాస్త్రి కూడా ధోనీ టీమిండియాలోకి రావాలంటే.. ఐపీఎల్ ప్రదర్శన కీలకమని చెప్పాడు.
ధోనీ రాక సందిగ్ధమే..
భారత జట్టులో ఎంఎస్ ధోనీ స్థానాన్ని భర్తీ చేసేందుకు పంత్, రాహుల్ వంటి యువ ఆటగాళ్లు పోటీపడుతున్నారు. రాహుల్ బ్యాటింగ్, కీపింగ్లో రాణిస్తున్నా.. పంత్ ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నాడు. అయితే రాహుల్ను ఫుల్టైం కీపర్గా చేయొద్దని కొంతమంది క్రీడావిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలా చేస్తే అతడి బ్యాటింగ్ లయ దెబ్బతినే అవకాశం ఉందని చెప్పారు. ఒకవేళ రాహుల్ గాయపడితే అతడి ప్రదర్శనను భర్తీ చేసే ఆటగాడూ ప్రస్తుతం ఎవరూ లేరన్నది మరో వాదన. ఈ నేపథ్యంలో ధోనీ, పంత్ మధ్య కీపింగ్ కోసం పోటీ నెలకొంది. ఇలాంటి కీలక సమయంలో అసలు టోర్నీ జరుగుతుందని స్పష్టత లేకపోవడం వల్ల వీరిద్దరి పరిస్థతి అయోమయంలో పడిపోయింది. వీరిద్దరికీ కూడా తమ ఫామ్ నిరూపించుకోడానికి ఐపీఎల్ ఒక్కటే అవకాశం ఉండటం గమనార్హం.