నాలుగేళ్లుగా ఐసీసీ పీఠంపై ఉన్నది ఒక భారతీయుడే. కానీ ఈ నాలుగేళ్లలో భారత క్రికెట్కు లాభం చేకూర్చేలా ఆయన ఒక్క నిర్ణయమూ తీసుకున్నది లేదు. పైగా నష్టం చేయడానికే ఎంతగానో ప్రయత్నించాడు. ఇప్పుడు ఆయన శకం ముగియబోతోంది. ఇప్పుడైనా తీరు మారుతుందనుకుంటే.. ఇప్పటికీ ఆయన బీసీసీఐని ఇరుకున పెట్టేందుకు గట్టి ప్రయత్నం చేస్తుండటం విడ్డూరం.
నాలుగేళ్ల కిందట బీసీసీఐ మద్దతుతో ఐసీసీ ఛైర్మన్ అయ్యాడు శశాంక్ మనోహర్. మరోసారి ఓ భారతీయుడు ఐసీసీ పీఠాన్ని అధిష్ఠించిన నేపథ్యంలో భారత్కు చాలా మేలు జరుగుతుందని అంతా అనుకున్నారు. మనోహర్ అందుకు విరుద్ధంగా ప్రవర్తించాడు. ఐసీసీకి అత్యధిక ఆదాయం అందించే బీసీసీఐకి.. ఆ ఆదాయంలో అత్యధిక వాటా పొందే హక్కు ఉండేలా ఒకప్పటి ఐసీసీ అధ్యక్షుడు శ్రీనివాసన్ ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా బోర్డులతో కలిసి 'బిగ్ త్రీ' నమూనాను తెచ్చాడు. కానీ మనోహర్ వచ్చాక ఆ నమూనాను మార్చాడు. ఐసీసీ ఆదాయం అందరికీ సమానంగా పంచేలా నిబంధనలు మార్చాడు. దీంతో బీసీసీఐ వందల కోట్లు నష్టపోయింది. ఇది మొదలుకుని పలు సందర్భాల్లో భారత్ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ వచ్చిన మనోహర్.. త్వరలోనే ఛైర్మన్ పదవి నుంచి దిగిపోబోతూ కూడా బీసీసీఐ వ్యతిరేకంగా పావులు కదుపుతున్నాడు!
ఈ ఏడాది అక్టోబరు-నవంబరు నెలల్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. ఆ సమయంలోనే ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ పొట్టి కప్పును వాయిదా వేసే విషయంలో ఐసీసీ మాత్రం ఎటూ తేల్చట్లేదు. దీనిపై గత నెలే ఏదో ఒకటి తేలుతుందనుకున్నారు. కానీ నిర్ణయాన్ని ఈ నెల 10న జరిగే సమావేశానికి వాయిదా వేశారు. కానీ ఆ సమావేశంలోనూ ఏమీ నిర్ణయించలేదు. ఇంకో నెలకు వాయిదా వేశారు. అయితే స్వయంగా టోర్నీని నిర్వహించాల్సిన ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డే షెడ్యూల్ ప్రకారం టోర్నీ నిర్వహణ సాధ్యపడదని ఇటీవలే తేల్చేసింది. అలాంటిది ఐసీసీ మాత్రం నెల తర్వాత నిర్ణయిస్తామనడం ఉద్దేశపూర్వకంగా ఈ విషయాన్ని సాగదీయడమే అని బీసీసీఐ భావిస్తోంది.
పొట్టి కప్పుపై ఐసీసీ తన నిర్ణయాన్ని చెబితే ఐపీఎల్కు సన్నాహాలు చేసుకుందామని బీసీసీఐ అనుకుంటుండగా.. అందుకు అవకాశం లేకుండా అయోమయాన్ని సృష్టించడానికే మనోహర్ ఇలా చేస్తున్నాడని బోర్డు వర్గాలు అనుమానిస్తున్నాయి. సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ తేదీలు ఖరారు చేయాలన్నా, టోర్నీని ఎక్కడ నిర్వహించాలో తేల్చాలన్నా టీ20 ప్రపంచకప్ భవితవ్యంపై స్పష్టత రావాలి.
"ఐసీసీ ఛైర్మన్ పదవి నుంచి దిగిపోతున్న వ్యక్తి ఎందుకీ అయోమయాన్ని సృష్టిస్తున్నాడు. ఆతిథ్య బోర్డే టీ20 ప్రపంచకప్ను నిర్వహించలేమంటోంది. అలాంటపుడు నిర్ణయం చెప్పడానికి నెల రోజులెందుకు? బీసీసీఐ, ఐపీఎల్ సంగతి వదిలేయండి. టీ20 ప్రపంచకప్పై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే.. ఆటగాళ్లు మిగతా సిరీస్ల మీద దృష్టిసారిస్తారు. మనోహర్ ఎప్పుడూ బీసీసీఐ ప్రయోజనాలకు వ్యతిరేకంగానే పని చేశాడు. ఇప్పుడు ఉద్దేశపూర్వకంగా టీ20 కప్పుపై నిర్ణయాన్ని వాయిదా వేయించాడు."
-బీసీసీఐ అధికారి
తన తర్వాత ఐసీసీ ఛైర్మన్ పదవిలో ఇంగ్లాండ్ బోర్డు చీఫ్ కొలిన్ గ్రేవ్స్ను కూర్చోబెట్టాలని చూస్తున్న మనోహర్.. అతడి ఎన్నిక ఏకగ్రీవం కావడం కోసం నామినేషన్ ప్రక్రియను ఆలస్యం చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఈ పదవికి బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పోటీ పడతాడని ప్రచారం జరగ్గా.. అతను అలాంటి సంకేతాలేమీ ఇవ్వలేదు.