క్రికెట్ మ్యాచ్ల చిత్రీకరణలో డ్రోన్ల వినియోగానికి షరతులతో కూడిన అనుమతులు లభించాయి. దేశంలో డ్రోన్ల వినియోగానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖతో పాటు.. డీజీసీఏ అనుమతి తప్పనిసరి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఈ ఏడాది క్రికెట్ మ్యాచ్ల చిత్రీకరణ కోసం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది.
బీసీసీఐ అభ్యర్థన మేరకు..
క్రికెట్ మ్యాచ్ల ప్రత్యక్ష చిత్రీకరణ కోసం 'రిమోట్లీ పైలట్ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్'(ఆర్పీఏఎస్)ను ఉపయోగించడానికి బీసీసీఐతో పాటు ఇతర అభ్యర్థనలు వచ్చాయని విమాన మంత్రిత్వ శాఖ(మోకా) తెలిపింది. 2021 డిసెంబర్ 31 వరకు దేశంలో క్రికెట్ మ్యాచ్ల వైమానిక చిత్రీకరణకు ఇవి జారీ అయ్యాయి. 1937-వైమానిక నియమాలు, నిబంధనల ప్రకారం అనుమతులు మంజూరయ్యాయి. ఈ మేరకు ఫిబ్రవరి 4న డీజీసీఐ, పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశాయి.
పెరుగుతోన్న డ్రోన్ల వినియోగం..
క్రీడలు, వినోద రంగాలతో పాటు.. వ్యవసాయం, మైనింగ్, ఆరోగ్య సంరక్షణ, ప్రకృతి విపత్తు నిర్వహణలో డ్రోన్ల వినియోగం వేగంగా విస్తరిస్తోందని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి అంబర్ దూబే తెలిపారు. డ్రోన్ల వాణిజ్య వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా.. భారత ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ అనుమతి ఇచ్చామన్నారు.
ఇదీ చదవండి: గగన్యాన్ వ్యోమగాముల ల్యాండింగ్ అక్కడేనా!