గోవాలో విలాసవంతమైన భవనాన్ని కొనుగోలు చేశారు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా. నార్త్ గోవాలోని అల్డోనా గ్రామంలో ఈ ఇల్లు ఉంది. ప్రస్తుతం అక్కడే ఉంటున్నారు. తాజాగా జడేజా ఐదు వేల జరిమానా కట్టారు. అందుకు కారణం పక్కనే ఉన్న నచినోలా అనే గ్రామంలో చెత్త పడేయడమే. ఈ విషయాన్ని ఆ గ్రామ సర్పంచ్ వెల్లడించారు.
"కొందరు బయట వ్యక్తులు మా గ్రామంలో చెత్త వేస్తున్నారు. ఇలాంటి వారిని గుర్తించడానికి కొందరు యువకుల్ని నియమించాం. వారు ఆ బ్యాగ్లను స్కాన్ చేసి ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకుంటారు. ఈ క్రమంలోనే ఓ బ్యాగ్పై అజయ్ జడేజా పేరుతో బిల్ పేపర్ గమనించాం. మరోసారి చెత్త వేయొద్దని హెచ్చరించాం. అతడు తన తప్పును ఒప్పుకొన్ని జరిమానా కట్టాడు. అతడిలాంటి పాపులర్ క్రికెటర్ ఇక్కడ ఉంటుంనందుకు ఎంతో గర్వంగా ఉంది. అయితే ఎంతటి సెలబ్రిటీ అయినా పారిశుద్ధ్య నిబంధనలు పాటించాల్సిందే" అని తెలిపారు సర్పంచ్ తృప్తి బండోద్కర్.
గోవాలోని అల్డోనా విలేజ్ చాలామంది సెలబ్రిటీస్కు సెకండ్ హోమ్గా ఉంటోంది. జడేజా, అమితావ్ ఘోష్తో పాటు మరికొందరు అక్కడే భవనాలు కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదిస్తూ విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు.