'సైరా'తో ప్రేక్షకులను చిరంజీవి అలరించడానికి మరికొద్ది రోజులే మిగిలుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాలను ముమ్మరం చేసింది. గురువారం రెండో ట్రైలర్ను విడుదల చేసింది. తాజాగా క్లైమాక్స్కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది.
ఈ చిత్రాన్ని తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో తెరకెక్కించారు. ఉయ్యాలవాడను ఉరితీసి హతమార్చిన ఆంగ్లేయులు... అప్పటికీ వారి ప్రతీకారం చల్లారకపోవడం వల్ల నరసింహారెడ్డి తలను ఆయన కోట గుమ్మానికే చాలా కాలం పాటు వేలాడదీశారు. ఈ సన్నివేశాల్ని యథాతథంగా 'సైరా' క్లైమాక్స్లోనూ చూపించబోతున్నారట.
అయితే ఈ చిత్రాన్ని ఇలా పూర్తి విషాదాంతంగా మార్చితే ప్రేక్షకులు ఒప్పుకోరనే ఉద్దేశంలో ఉంది చిత్రబృందం. అందుకే 'సైరా' పంచిన స్వాతంత్ర్య స్ఫూర్తితో.. దేశంలో సిపాయిల తిరుగుబాటు సహా అనేక ఉద్యమాలకు ఉయ్యాలవాడ పోరాటం ఎలాంటి స్ఫూర్తిని పంచిందో చూపించబోతున్నారని సమాచారం.
క్లైమాక్స్లో చిరు అస్తమించాక.. దాదాపు పదిహేను నిమిషాల వరకు ఆయన కనిపించకుండానే కథ నడవనుందట. 'సైరా' వీరమరణం తర్వాత వచ్చే పతాక సన్నివేశాలకు పవన్ కల్యాణ్ తన వాయిస్ ఓవర్తో నడిపించనున్నారట. మరి ఇందులో వాస్తవమెంతన్నది తెలియాలంటే సనిమా విడుదల వరకు ఆగాల్సిందే.