సల్మాన్ఖాన్ కథానాయకుడిగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాధే'. దిశా పటానీ కథానాయిక. ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర కథానాయిక దిశా పటానీ స్పందిస్తూ.. "నా జీవితంలో ఇంత వరకు ఇలాంటి మాస్ చిత్రంలో నటించలేదు. ఇందులో నటించడం చాలా ఆనందంగా ఉంది. చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ నాకెంతో నచ్చింది. ఓ పెద్ద దర్శకుడితో పాటు పెద్ద హీరోతో కలిసి పనిచేయడం నా అదృష్టం. కరోనా వల్ల జీవితం నిలిచిపోయింది. కాలం ఆగిపోయినట్లు అనిపిస్తోంది. ఏం జరుగుతుందో తెలిసే సరికి అప్పుడే సంవత్సర కాలం గడిచిపోయింది. 'రాధే' గతేడాది మే 22న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ మహమ్మారి కారణంగా ఆలస్యం అయింది. అయినా ప్రస్తుతం ఎన్నో దేశాల్లో నిబంధనలకు లోబడి సినిమా విడుదల అవుతోంది."
"మరొక విశేషం ఏమిటంటే ఇంట్లోనే ప్రేక్షకుల భద్రత కోసం పే పర్ వ్యూ పద్ధతిలో జీ ప్లెక్స్, డిష్ టీవీల్లోనూ 'రాధే' ప్రసారం కానుంది. ప్రేక్షకుల భద్రత దృష్ట్యా ఇది సరైన విధానం అనిపిస్తోంది. సల్మాన్తో తొలిసారిగా 'భారత్'లో కలిసి పనిచేశాను. అప్పుడు కొంచెం భయపడ్డా. బాలీవుడ్లోనే పెద్ద హీరో. అలాంటిది ఆయన పక్కన ఎలా నటిస్తానో అని భయమేసింది. కానీ ఇప్పడు రెండోసారి 'రాధే'తో ఆ సమస్య తీరిపోయింది. సెట్లో ఆయన నాకెంతో సహకరించారు. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నా. అయితే సెట్లో సల్మాన్ సొంత విషయాలను, హాస్యాన్ని కూడా జత చేస్తుంటాడు. ఇలాంటివి మాత్రం నేను అలవాటు చేసుకోలేదు."
"ఇక దర్శకుడు ప్రభుదేవా అయితే కొత్తగా చేయడానికి ఇష్టపడతారు. ఈ సినిమాతో సెట్కి వెళ్లే ముందు రెడీ కావడం అలవాటు చేసుకున్నా. ఇది కొంచెం కష్టమైన పనే నా వరకు. అయినా సరే ఇలాంటి పెద్ద చిత్రానికి అందరితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది" అని తెలిపింది దిశా.
ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, రణదీప్ హుడా, మేఘా ఆకాష్, గౌతమ్ గులాటీ తదితరులు నటిస్తున్నారు. జీ స్టూడియోస్, రీల్ లైఫ్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మితమైన సినిమాకి అతుల్ అగ్నిహోత్రి, సోహైల్ ఖాన్ నిర్మాతలు. తెలుగులో అల్లు అర్జున్ నటించిన 'దువ్వాడ జగన్నాథం'లోని 'సీటీమార్' గీతాన్ని ఇందులో రీమేక్ చేశారు.