సూపర్స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'అన్నాత్తే'. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కొద్దిరోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకొంటోంది. అయితే హైదరాబాద్లోని ఐకియా స్టోర్ వద్ద కూడా కొన్ని సన్నివేశాలను తెరకెక్కించారట. తాజాగా ఈ మూవీ షూటింగ్లో పాల్గొనేందుకు లేడీ సూపర్ స్టార్ నయనతార భాగ్యనగరంలో అడుగుపెట్టింది. ఇక్కడి షెడ్యూల్ మే 10వరకు జరగనుందని సమాచారం.
ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలకపాత్ర కోసం ఎంపికయ్యారు. గతేడాది డిసెంబర్లో షూటింగ్ను తిరిగి మొదలు పెట్టినా.. కరోనా కారణంగా చిత్రీకరణ వాయిదా పడింది. కళానిధి మారన్ సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోన్న ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, ఖుష్బూ, ప్రకాశ్ రాజ్, రోబో శంకర్ తదితరులు నటిస్తున్నారు. డి.ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు.