తమిళ స్టార్ ధనుశ్ కథానాయకుడిగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'జగమే తంత్రం'. ఐశ్వర్య లక్ష్మీ కథానాయిక. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా ఇన్నాళ్లూ విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీలో విడుదల చేస్తారని కూడా వార్తలు వినిపించాయి. దీంతో స్పందించిన చిత్ర బృందం అలాంటిదేమీ లేదని చెప్పింది.
కాగా, ఇప్పుడు మరోసారి 'జగమే తంత్రం' ఓటీటీలో విడుదలవుతుందని అంటున్నారు. అంతేకాదండోయ్ థియేటర్లో విడుదల చేసి, అదే రోజున ఓటీటీలోకి కూడా తీసుకొస్తారని కోలీవుడ్ కోడై కూస్తోంది. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి స్పందన లేదు. ధనుశ్ ఫ్యాన్స్ను దృష్టిలో పెట్టుకుని తొలుత థియేటర్లో విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోందట. దీనిపై థియేటర్ యజమానులు మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
థియేటర్లో విడుదలై కనీసం నెల రోజులైన తర్వాత ఓటీటీలో విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. మరి చిత్ర బృందం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాను శశికాంత్, చక్రవర్తి, రామచంద్ర నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ స్వరాలు సమకూరుస్తున్నారు.
ఇదీ చూడండి : టాలీవుడ్లో ఈ ఏడాది రిలీజ్ కానున్న చిత్రాలివే!