ప్రముఖ నటుడు శ్రీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'చదరంగం' భారతీయ ఉత్తమ వెబ్ సిరీస్ (ప్రాంతీయ) అవార్డు సొంతం చేసుకుంది. వీడియో, ఆడియో క్వాలిటీ ఆధారంగా ఎంపికైంది. స్ట్రీమింగ్ మీడియా అవార్డ్స్ 2021, ఎక్స్ఛేంజ్ ఫర్ మీడియా గ్రూప్ కలిసి ఈ అవార్డును ప్రకటించాయి.
"ఈ అవార్డు దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఈ సిరీస్ మా హృదయానికి బాగా దగ్గరైంది. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని ప్రాజెక్టులు చేసేందుకు స్ఫూర్తినిచ్చింది. శ్రీకాంత్ గారు, దర్శకుడు రాజ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ విజయ్, చిత్రబృందం వల్ల ఇది సాధ్యమైంది. నన్ను నమ్మినందుకు జీ 5కి ధన్యవాదాలు."
-మంచు విష్ణు, నటుడు, సిరీస్ నిర్మాత
2020 ఫిబ్రవరిలో జీ 5 వేదికగా విడుదలైంది ఈ వెబ్ సిరీస్. రాజకీయ నేపథ్యంలో తొమ్మిది భాగాలుగా వచ్చి ప్రేక్షకుల్ని విశేషంగా అలరించింది. ఈ సిరీస్ని 24 ఫిల్మ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు నిర్మించాడు.