ఒక భాషలో విజయవంతమైన చిత్రాలను ఇతర భాషల్లో డబ్ చేసి విడుదల చేయడం లేదా రీమేక్ చేయడం చిత్రసీమలో షరా మామూలే. ఇలా బాలీవుడ్ నుంచి దక్షిణాది సినీపరిశ్రమకు ఎగుమతైన చిత్రాలున్నాయి. అలాగే దక్షిణాది సినిమాలూ హిందీలో రీమేక్ అయ్యాయి. తమిళంలో సూపర్హిట్గా నిలిచిన 'గజిని' (2008) నుంచి 'అర్జున్రెడ్డి' (2019) వరకు బాలీవుడ్లో అనేక రీమేక్ సినిమాలు సూపర్హిట్ అయ్యాయి. అయితే అందుకు భిన్నంగా ఇక్కడ సూపర్హిట్ అయ్యి బాలీవుడ్లో తుస్సుమనిపించిన సినిమాల వివరాలేంటో చూడండి.
ఓకే జాను (2017)
విలక్షణ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన రొమాంటిక్ చిత్రం 'ఓ కాదల్ కన్మయి' (2015). తెలుగులో 'ఓకే బంగారం'గా విడుదల చేసి హిట్ను అందుకున్నారు. అయితే ఇదే సినిమాను బాలీవుడ్లో 'ఓకే జాను'గా రూపొందించగా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచింది.
రన్ (2004)
2002లో విడుదలైన 'రన్' అనే తమిళ చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. ఇందులో అభిషేక్ బచ్చన్, భూమిక చావ్లా ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం ఎదుర్కోవడం సహా విమర్శకులను మెప్పించలేకపోయింది. అయితే ఈ సినిమాను బుల్లితెరపై ప్రసారం చేసినప్పుడు విశేషాదరణ దక్కించుకుంది.
ప్రస్థానం (2019)
టాలీవుడ్లో విడుదలైన 'ప్రస్థానం' (2010) చిత్రాన్ని అదే పేరుతో బాలీవుడ్లో తెరకెక్కించారు. ఇందులో సంజయ్ దత్, మనీషా కోయిరాల, జాకీ ష్రాఫ్, అలీ ఫజల్, సత్యజిత్ దూబే, అమైరా దస్తూర్, చుంకీ పాండే ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది.
రామయ్యా వస్తావయ్యా (2013)
ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా తెలుగులో దర్శకత్వం వహించిన తొలి చిత్రం 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' (2005). ఈ చిత్రాన్ని బాలీవుడ్లో 'రామయ్యా వస్తావయ్యా' (2013)గా రీమేక్ చేశారు. ఇందులో గిరీశ్ తౌరానీ, శ్రుతీ హాసన్ లీడ్ రోల్స్ చేశారు. ఇందులోని పాటలకు మంచి ప్రేక్షాదరణ లభించినా.. అది సినిమా విజయానికి దోహదపడలేకపోయింది.
కట్టా మీటా (2010)
1988లో విడుదలైన మలయాళ చిత్రం 'వెల్లనకలుడే నాడు' చిత్రాన్ని బాలీవుడ్లో 'కట్టా మీటా'గా దర్శకుడు ప్రియదర్శన్ రీమేక్ చేశారు. ఇందులో అక్షయ్ కుమార్ సరసన హీరోయిన్ త్రిష కృష్ణన్ నటించడం సహా ఇదే చిత్రంతో బాలీవుడ్ అరంగేట్రం చేసింది. ఈ సినిమాకు నెగిటివ్ రివ్యూస్ రావడం వల్ల బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని ఎదుర్కొంది.
పోలీస్గిరి (2013)
తమిళ చిత్రం 'సామి'కి హిందీ రీమేక్ ఇది. సంజయ్ దత్, ప్రాచీ దేశాయ్ ప్రధానపాత్రల్లో నటించారు. ఈ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకులనూ మెప్పించలేకపోయింది.
ఖుషీ (2003)
2000లో విడుదలైన తమిళ చిత్రం 'ఖుషీ'.. అదే పేరుతో బాలీవుడ్లో రీమేక్ చేశారు. బాలీవుడ్ చరిత్రలో ఇదో చెత్త సినిమాగా పేరు తెచ్చుకుంది.
ఇదీ చూడండి: 'ట్రైలర్' కథేంటి? దాన్ని మొదలుపెట్టింది ఎవరు?