ఓ సినిమా తీయాలంటే ఎన్నో అంశాలు ముడిపడి ఉంటాయి. ఎంతోమంది రాత్రింబవళ్లు శ్రమిస్తే ఓ చిత్రం రూపొందుతోంది. అయితే ఆర్థిక సమస్యలు సహా పలు కారణాలతో కొన్ని సినిమాల షూటింగ్ మధ్యలోనే ఆగిపోతుండగా.. మరికొన్ని ఆలస్యంగా జరుపుకొంటుంటాయి. వీటిలో కొన్ని సంవత్సరాల పాటు విడుదలకు నోచుకోవు. చాలా ఏళ్ల తర్వాత విడుదలై ప్రేక్షాదరణ పొందుతాయి. అలాంటి ఆ సినిమాలు ఏంటంటే?
ఐ లవ్ ఎన్వై(2015)
బాలీవుడ్ స్టార్ నటులు సన్నీ దేఓల్, కంగనా రనౌత్ కలిసి నటించిన ఈ సినిమాను 2011లో మొదలుపెట్టగా.. 2015లో విడుదలకు నోచుకుంది. సినీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.
జమ్మనాత్(2014)
1986లో ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. పదేళ్ల తర్వాత సెట్స్పైకి వెళ్లి, దాదాపు ఆరేళ్ల పాటు షూటింగ్ జరుపుకొంది. ఇందులో అమితాబ్ బచ్చన్, కరిష్మా కపూర్, అర్షద్ వార్సీ కీలక పాత్రలు పోషించారు. 2014లో విడుదలై ప్రేక్షకుల మనసులను దోచుకుంది.

దీవానా మై దీవానా(2013)
గోవిందా, ప్రియంక చోప్రా కలిసి నటించిన ఈ చిత్రం.. 2013లో విడుదలై హిట్గా నిలిచింది. ఇందులోని ప్రత్యేక గీతం 'కాలా డొరియా' కుర్రకారును ఉర్రూతలూగించింది. అయితే ఈ సినిమా చిత్రీకరణ ఎప్పుడు జరిగిందో సరిగ్గా తెలీదు. అప్పుడు రెండు పదుల వయసులో ఉంది ప్రియంక. కాబట్టి దీని ఆధారంగా ఈ చిత్రం చాలా కాలం పాటు విడుదలకు నోచుకోలేదని తెలుస్తోంది.

సనమ్ తేరీ కసమ్(2009)
సైఫ్ అలీఖాన్, పూజా భట్, అతుల్ అగ్నిహోత్రి, షీబా అక్షదీప్ ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్ జరిగిన దాదాపు పదిహేనేళ్ల తర్వాత 2009లో విడుదలైంది. దీనికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.

మెహబూబా(2008)
ఇందులో సంజయ్ దత్, అజయ్ దేవగణ్, మనీషా కొయిరాలా ప్రధాన పాత్రల్లో నటించారు. 1999లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ అనివార్య కారణాల వల్ల ఆగుతూ ఆగుతూ 2003లో పూర్తిచేసుకుంది. 2008లో విడుదలై బాగా ఆడింది.

యే లమ్హే జుదాయి కే(2004)
బాలీవుడ్లో అరంగేట్రం చేసిన తొలి రోజుల్లో షారుక్ ఖాన్ ఈ చిత్రంలో నటించారు. రవీనా టాండన్ హీరోయిన్. అయితే షూటింగ్ ప్రారంభించిన కొన్ని రోజులకే చిత్రీకరణ నిలిచిపోయింది. ఆ తర్వాత 1994లో స్క్రిప్ట్లో మార్పులు చేసి దానిని పూర్తిచేశారు. అనంతరం పదేళ్ల తర్వాత 2004లో విడుదలైప్రేక్షకులను ఆకట్టుకుంది.
హమ్ తుమ్హారే హై సనమ్(2002)
సల్మాన్, షారుక్ నటించిన ఈ మల్టీస్టారర్లో మాధురీ దీక్షిత్ కథానాయిక. 1996లో మొదలుపెట్టగా.. ఆరేళ్ల పాటు ప్రొడక్షన్ పనులు జరుపుకొని 2002లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాలో తొలుత సన్నీ దేఓల్, అమీర్ ఖాన్, జూహీ చాహ్లాను అనుకున్నారు.

అతాంక్ హై అతాంక్(1995)
క్రైమ్ కథాంశంతో హీరో అమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తీసిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలిచింది. అయితే ఇందులోని తన నటనకుగానూ అసంతృప్తి చెందానని అమిర్, గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

పాకీజా(1972)
తొలుత బ్లాక్ అండ్ వైట్లో విడుదలైన పాకీజా.. మంచి విజయం సాధించింది. అనంతరం ఈ చిత్రాన్ని మళ్లీ చిత్రీకరణ జరిపి కలర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. 1957 నుంచి 1964 వరకు చిత్రీకరణ జరుపుకుందీ సినిమా. అనంతరం 1972లో విడుదలైంది.

ఇట్స్ మై లైఫ్(2020)
తెలుగు సినిమా 'బొమ్మరిల్లు' హిందీ రీమేక్ 'ఇట్స్ మై లైఫ్'. మాతృకలోని హీరోయిన్ జెనిలీయానే ఇందులోనూ నటించింది. హర్మన్ బవేజా హీరో. నానా పాటేకర్ కథానాయకుడిగా తండ్రిగా చేశారు. 2007లో మొదలైన ఈ సినిమా.. ఇన్నేళ్ల పాటు అనివార్య కారణాలతో ఆగిపోయింది. మళ్లీ ఇప్పుడు పదమూడేళ్ల విరామం తర్వాత నవంబరు 29న టీవీలో నేరుగా విడుదల కానుంది. మరి చూడాలా ఎంతలా ప్రజాదరణ దక్కించుకుంటుందో ఈ సినిమా.

ఇదీ చూడండి : 13 ఏళ్ల తర్వాత 'బొమ్మరిల్లు' రీమేక్కు మోక్షం