టాలీవుడ్కు చెందిన ఓ ప్రముఖ నిర్మాత కుమారుడిగా వెండితెరకు పరిచయమై.. హీరోగా విభిన్నమైన కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు నటుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. 'అల్లుడు శీను'తో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ 'రాక్షసుడు', 'సాక్ష్యం', 'జయ జానకి నాయక' చిత్రాలతో సినీ ప్రియుల్ని అలరించాడు.
కాగా, కొన్నేళ్లుగా తెలుగువారిని అలరిస్తోన్న శ్రీనివాస్.. బాలీవుడ్ ప్రేక్షకుల్నీ మెప్పించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రభాస్ కథానాయకుడిగా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన 'ఛత్రపతి' బాలీవుడ్ రీమేక్లో ఇతడు హీరోగా నటించనున్నాడు. ఈ సినిమా రీమేక్ బాధ్యతలను డైరెక్టర్ వి.వి.వినాయక్ చూసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలోనే శ్రీనివాస్.. ముంబయికి మకాం మార్చినట్లు సమాచారం. అత్యంత ఖరీదైన జూహూ ప్రాంతంలో ఈ హీరో ఓ ఫ్లాట్ను అద్దెకు తీసుకున్నాడని.. 'ఛత్రపతి' రీమేక్ షూట్ అయ్యేంత వరకూ అక్కడే నివాసముంటాడని సోషల్మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా శ్రీనివాస్ జూహూలోని ఓ జిమ్ నుంచి బయటకు వస్తోన్న కొన్ని ఫొటోలు బయటకు వచ్చాయి. దీంతో 'ఛత్రపతి' రీమేక్ తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ బీటౌన్లో మరికొన్ని ప్రాజెక్ట్లు ఓకే చేయనున్నాడా? అని పలువురు నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.