మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య' మోషన్ పోస్టర్ విడుదలై, అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. అయితే ఈ కథ తనదేనని, కాపీ కొట్టి సినిమా తీస్తున్నారని టాలీవుడ్లోని ఓ అసిస్టెంట్ డైరెక్టర్ ఆరోపించారు. ఇప్పుడీ విషయమై స్పందించిన చిత్రబృందం.. 'ఆచార్య' కథను దర్శకుడు కొరటాల శివే స్వయంగా రాశారని తెలిపింది. కాపీ అంటూ వస్తున్న వ్యాఖ్యలు అర్థం లేనివంటూ ఓ ప్రకటనను విడుదల చేసింది.
![konidela pro note](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8578730_acharya-3.jpg)
'ఆచార్య' కథను చాలా భద్రంగా ఉంచామని, కొద్దిమందికి మాత్రమే అది తెలుసని చిత్రబృందం పేర్కొంది. కేవలం మోషన్ పోస్టర్ చూసి కాపీ అనడం భావ్యం కాదని తెలిపింది. దర్శకుడు కొరటాల శివ పేరు చెడగొట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని వెల్లడించింది.
ఈ సినిమాలో కాజల్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్చరణ్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కరోనా ప్రభావం తర్వాత ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభించింది 'ఆచార్య' టీమ్.