ఫేస్బుక్, మొబిక్విక్, లింక్డ్ఇన్లలో డేటా లీక్ గురించి మరువక ముందే.. మరో సంస్థ కూడా హ్యాకింగ్ బారినపడింది. ప్రముఖ రిటైల్ బ్రోకింగ్ సంస్థ అప్స్టాక్స్పై హ్యాకర్లు సైబర్ దాడి చేశారు. ఈ విషయాన్ని అప్స్టాక్స్ స్వయంగా వెల్లడించింది.
ఈ సైబర్ దాడిలో యూజర్ల కాంటాక్ట్స్ , కేవైసీ వివరాలు లీకైనట్లు తెలిపింది అప్స్టాక్స్. కానీ కచ్చితంగా ఎంతమంది డేటా లీకైందనే విషయంపై స్పష్టతనివ్వలేదు. అయితే యూజర్ల ఫండ్స్, సెక్యూరిటీలు మాత్రం భద్రంగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
లీక్ అయిన డేటా శాంపిళ్లను హ్యాకర్లు ఆదివారం ఉదయం డార్క్వెబ్లో ఉంచినట్లు అప్స్టాక్స్ అధికార ప్రతినిధి ఒకరు యూజర్లకు పంపిన ఈ-మెయిల్లో పేర్కొన్నారు. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు జరిపేందుకు ఓ అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థను నియమించినట్లు వెల్లడించారు.
డేటా భద్రత కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామని యూజర్లకు తెలిపింది అప్స్టాక్స్. ముఖ్యంగా థర్డ్ పార్టీ వేర్హౌజ్లలో ఉంచిన డేటాకు భద్రతను పెంచినట్లు వెల్లడించింది. డేటాపై 24x7 నిఘా ఉంచినట్లు పేర్కొంది. యూజర్లకు ఓటీపీ ద్వారా పాస్వర్డ్లు మార్చుకోమని కూడా సూచించినట్లు అప్స్టాక్స్ వివరించింది.
రతన్ టాటా, టైగర్ గ్లోబల్ వంటి దిగ్గజాల పెట్టుబడులున్న అప్స్టాక్స్కు ప్రస్తుతం 30లక్షల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
ఇదీ చదవండి:50 కోట్ల లింక్డ్ఇన్ యూజర్ల డేటా లీక్!