భారత మొబైల్ మార్కెట్లో చైనా కంపెనీల ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు దేశీయ మొబైల్ తయారీ కంపెనీలు సిద్ధమవుతున్నాయి. త్వరలోనే కొత్త సిరీస్లో స్మార్ట్ఫోన్లు తీసుకురానున్నట్లు దేశీయ మొబైల్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్ ప్రకటించింది. ఈ మేరకు మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ ట్విట్టర్లో ఒక వీడియోను షేర్ చేశారు. ఇందులో ఆయన మైక్రోమాక్స్ ఎలా ప్రారంభమైంది..తర్వాత చైనా కంపెనీల రాకతో కష్టాలను ఎదుర్కొన్న తీరును వివరించారు. అలానే ప్రస్తుతం చైనాతో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ పిలుపు మేరకు దేశం కోసం మైక్రోమాక్స్ తన వంతు పాత్ర పోషించబోతుందని తెలిపారు.
అందులో భాగంగానే త్వరలో కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లను విడుదల చేయనున్నట్లు తెలిపారు. 'ఇన్'(In) అనే అక్షరాలు రాసి ఉన్న మొబైల్ ఫోన్ బాక్స్ను చూపిస్తూ మైక్రోమాక్స్ తిరిగి వస్తోందన్నారు. దీన్నిబట్టి మైక్రోమాక్స్ ఇన్ అనే కొత్త సిరీస్ స్మార్ట్ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం మైక్రోమాక్స్ చైనా కంపెనీలకు పోటీగా అందుబాటు ధరలో ఆకర్షణీయమైన ఫీచర్స్తో కొత్త ఫోన్లను తీసురానుందట.
ధర...
ఈ ఫోన్ ధర రూ. 7,000 నుంచి రూ. 15,000 మధ్య ఉండొచ్చని సమాచారం. ఆండ్రాయిడ్ ఆధారిత ఓఎస్తో ఇవి పనిచేస్తాయని తెలుస్తోంది. ఇన్ సిరీస్ ఫోన్ల ఫీచర్లతో పాటు ఇతర వివరాలు తెలియాలంటే కంపెనీ ప్రకటించే వరకు వేచి చూడాల్సిందే.