పాత గెలాక్సీ స్మార్ట్ఫోన్లను రోగ నిర్ధరణ (మెడికల్ డయాగ్నోసిస్) కెమెరాలుగా మార్చనున్నట్లు టెక్ దిగ్గజం శాంసంగ్ తెలిపింది. భారత్, వియత్నాం, మొరాకో, పపువా న్యూగినియా వంటి దేశాల్లో కంటి ఆరోగ్య సేవలు మెరుగు పరచడానికి వీటిని వినియోగిస్తామని వెల్లడించింది.
నేత్ర సమస్యలను గుర్తించే వైద్య పరికరాలను తయారు చేసేందుకు ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ బ్లైండ్నెస్ (ఐఏపీబీ), యోన్సే యూనివర్సిటీ హెల్త్ సిస్టమ్ (వైయూహెచ్ఎస్)తో శాంసంగ్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) లెక్కల ప్రకారం.. 220 కోట్ల మంది కంటిచూపు సమస్యలతో బాధపడుతుండగా.. ఇందులో సగానికి పైగా కేసులను నయం చేయవచ్చు.
2017 నుంచి గెలాక్సీ అప్సైక్లింగ్ కార్యక్రమం..
సరైన వైద్య నిర్ధరణ పరీక్షలతో ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల దృష్టి లోపాలున్న కేసులకు గెలాక్సీ అప్సైక్లింగ్ కార్యక్రమం పరిష్కారం చూపుతుందని శాంసంగ్ తెలిపింది.
గెలాక్సీ పరికరాలను వినూత్న పద్ధతుల్లో వినియోగించేందుకు 2017లో గెలాక్సీ అప్సైక్లింగ్ కార్యక్రమాన్ని శాంసంగ్ తీసుకొచ్చింది. ఇందులో పాత గెలాక్సీ స్మార్ట్ఫోన్ ఐలైక్ హ్యాండ్హెల్డ్ ఫండస్ కెమెరాగా పనిచేస్తుంది. కంటి పరీక్షకు లెన్స్గా కెమెరాను అనుసంధానం చేస్తారు. ఇక చిత్రాలను బంధించడానికి స్మార్ట్ఫోన్ను వినియోగిస్తారు. ఆ తర్వాత కంటి వ్యాధులను నిర్ధరించడానికి గెలాక్సీ స్మార్ట్ఫోన్ కృత్రిమ మేధ ఆల్గారిథమ్ వాడుతుంది. అనంతరం యాప్కు అనుసంధానమై రోగి వివరాలను పరిశీలించి, చికిత్స విధానం, ఇతర సమాచారాన్ని అందిస్తుంది. డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా సహా అంధత్వానికి దారితీసే పలు కేసులను ఈ కెమెరాల సాయంతో గుర్తించవచ్చని పేర్కొంది శాంసంగ్.