నవ్వు.. మనుషులకు మాత్రమే పరిమితమైన భావోద్వేగం. దేవుడిచ్చిన వరం. అంతటి గొప్ప వరాన్ని కంప్యూటర్లు, మరమనుషులకు సైతం నేర్పిస్తే.. మనుషులకు మరింత దగ్గరవుతాయి అంటున్నారు రెండున్నర దశాబ్దాలుగా భాషలు, హాస్యంపై పరిశోధనలు చేస్తున్న ట్రిపుల్ ఐటీ ఆచార్యురాలు డాక్టర్ రాధిక మామిడి. ‘రాజమహేంద్ర వరంలో బీఎస్సీ పూర్తి చేశాక.. భాషాశాస్త్రంపై ఆసక్తితో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అప్లయ్డ్ లింగ్విస్టిక్స్లో ఎంఏ చేశాను. అక్కడే ఎంఫిల్, పీహెచ్డీ చేశాను. ఆసమయంలో సాహిత్య అనువాదాలపై థీసిస్ రాయాల్సి ఉంటుంది. అందరూ రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల అనువాదం ఎంచుకుంటే నేను మాత్రం ఒకింత సవాల్గా ఉండాలని ఇంగ్లిష్ జోక్స్ను తెలుగులోకి అనువాదం చేసే పని పెట్టుకున్నా. జోక్స్ అనువాదం తేలికైన వ్యవహారంలా అనిపించినా చాలా కష్టమైన పని అది. భాషాశాస్త్ర పరిశోధకురాలిగా గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలోని హాస్య సన్నివేశాలను సైతం అప్పుడే విశ్లేషించాను’ అంటారు రాధిక.
పాతికేళ్లుగా పరిశోధనలు..
పాతికేళ్ల క్రితం సీడాక్ ముంబయిలో తన కెరీర్ని మొదలుపెట్టారు రాధిక. అప్పట్లో.. మనుషులు కాకుండా యంత్రాలు భాషని అనువాదం చేయడంపై పనిచేశారామె. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి యంత్రాల సాయంతో వార్తల్ని అనువదించేవారు. అది మొదలు.. ఇప్పటివరకూ భాష, సాంకేతికతలపైనే పనిచేస్తున్నారామె.
'సౌదీ అరేబియాలోని ప్రిన్స్సుల్తాన్ యూనివర్సిటీలో ఆరేళ్లపాటూ కంప్యూటేషనల్ లింగ్విస్టిక్స్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేశాను. 300 పేజీల పుస్తకాన్ని ఒక పేజీలో రాయమంటే మీరు ఆ పుస్తకాన్ని మొత్తం చదివి కానీ రాయలేరు. కానీ మెషీన్ అలా కాదు... ఈ పనిని చాలా తేలికగా చేసి పెడుతుంది. దీనికి సంబంధించిన పాఠాలని విద్యార్థులకు బోధించేదాన్ని. ఆ తర్వాత 2010లో పోలాండ్లో లాఫాల్ పేరుతో అంతర్జాతీయ హాస్య సదస్సు జరిగింది. ఆ సదస్సులోనే భాష- హాస్యం పై పనిచేస్తున్న అనేక మంది ప్రొఫెసర్లను నేను కలిసాను. నేను ఎంఫిల్లో చేసిన అంశం కూడా అదే కావడంతో యంత్రాలు కూడా హాస్యానికి స్పందించేలా చేయాలని అప్పుడే అనుకున్నాను' అంటూ తన మనసులో మాటను బయటపెట్టారు.
'మనదేశానికి వచ్చి ట్రిపుల్ ఐటీలోని భాష సాంకేతికత పరిశోధన కేంద్రం(ఎల్టీఆర్సీ)లో చేరాక ఇక్కడ డైలాగ్ సిస్టమ్స్- మెషీన్ ట్రాన్స్లేషన్ అంశంపై పాఠాలు చెప్పేదాన్ని. అంటే ఒక భాషని ఇంకో భాషలోకి యంత్రం సాయంతో అనువదించేటప్పుడు వచ్చే సమస్యలు అధిగమించడం ఎలానో చెప్పేదాన్ని. ఆ పనిచేస్తూనే మరోపక్క కృత్రిమమేధ, మిషన్ లెర్నింగ్ వంటి అంశాలని జోడించి కంప్యూటర్లకు హాస్యం పరిచయం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించాను. ముందుగా జోక్స్ని కంప్యూటర్ గుర్తిస్తుందా... లేదా? అనే దానిపై పరిశోధన చేశాను. ఇందులో రెండు అంశాలు కీలకం. కంప్యూటర్లు జోక్స్ని గుర్తించి, స్పందించడం ఒకటైతే.. దానికి ప్రతిస్పందనగా తిరిగి జోక్స్ని వేయడం రెండోది. ఈ రెండింటిపైనా నేను పరిశోధనలు చేశా. ఏడాదిపాటు మా బృందంతో కలిసి పరిశోధనలు చేశాక... నా ప్రయత్నం ఫలించింది. కంప్యూటర్ జోక్స్కి స్పందించి.. జోక్స్ని తిరిగి జనరేట్ చేయడం మొదలుపెట్టింది. పెద్ద పెద్ద సంస్థలు ఆంగ్లంలో ఉండే హాస్యానికి కంప్యూటర్ ఎలా స్పందిస్తుందనే దానిపై పరిశోధనలు చేస్తున్నాయి. కానీ మన భారతీయ భాషల్లో ఈ ప్రయత్నం చాలా తక్కువగా జరుగుతుందనే చెప్పాలి. తెలుగుకు సంబంధించిన వరకూ మేం చేస్తున్నాం. కన్యాశుల్కం పుస్తకంలోని హాస్యాన్ని అధ్యయనం చేసి ఈ సమాచారాన్ని ముందుగానే కంప్యూటర్లో డేటా రూపంలో నిక్షిప్తం చేశాం. ఆ పుస్తకంలో నవ్వు తెప్పించే వాక్యాలు వచ్చినప్పుడు కృత్రిమ మేధ ఆధారంగా కంప్యూటర్ నవ్వడం, స్పందించడం, తిరిగి జోక్ చేయడం చేస్తోంది. ఈ పరిశోధనలను ఉపయోగించి భవిష్యత్తులో దీన్ని ఓ ఉత్పత్తిగా తీసుకురావాలన్నది నా కల' అంటున్నారు రాధిక.
ఇదీ చదవండి: ఈనాడు-ఈటీవీ భారత్ కథనాలతో దొంగ ఆసుపత్రి సీజ్