ETV Bharat / opinion

జన చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష

author img

By

Published : Mar 17, 2021, 6:58 AM IST

ఈ మధ్యకాలంలో భారత ప్రజాస్వామ్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చర్చనీయాంశం అవుతోంది. పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు గాడి తప్పి నియంతృత్వ పోకడలు రావడం ఇందుకు కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బ్రిటన్​కు చెందిన ఎకనామిక్ ఇంటెలిజెన్స్ అందిస్తున్న నివేదికల్లో భారత్​ తన స్థానాన్ని దిగజార్చుకోవడమే అందుకు ఉదాహరణ అని పేర్కొంటున్నారు.

opinion
జన చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ; రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు, శాసనసభల నిర్మాణం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులు, వర్గాలకోసం కాకుండా- సమాజంలోని అన్ని వర్గాల ప్రగతికి ప్రభుత్వాలు కృషి చేస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భిన్న అభిప్రాయాలు, ధోరణుల పట్ల ప్రభుత్వాలు సహనాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వం సక్రమమైన పాలనను అందించనప్పుడు ప్రశ్నించి, నిలదీసి- ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ మధ్యకాలంలో భారత ప్రజాస్వామ్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చర్చనీయాంశం అవుతోంది. సరళీకృత ఆర్థిక సంస్కరణల ప్రతికూల ప్రభావానికి ప్రజలు గురికావడం- పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు గాడి తప్పి నియంతృత్వ పోకడలు చోటుచేసుకోవడం ఇందుకు కారణాలు.

దిగజారిన ‘సూచీ’

బ్రిటన్‌కు చెందిన ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల పనితీరును విశ్లేషిస్తూ 2006 నుంచి ప్రజాస్వామ్య సూచీ వార్షిక నివేదికలను ప్రచురిస్తోంది. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ సంస్కృతి, ప్రభుత్వాల పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, పౌర స్వేచ్ఛ వంటి అరవై కొలమానాల ప్రాతిపదికగా దేశాలను వర్గీకరించి- సూచీని రూపొందిస్తారు. ఈ సంస్థ ప్రకటించిన 2014 వార్షిక నివేదికలో పదికి 7.92 స్కోరుతో భారత దేశం 27వ స్థానంలో నిలిచింది. 2019 నివేదికలో ఇండియా 6.9 స్కోరుతో 51వ స్థానంలో ఉంది. 2021 ఫిబ్రవరిలో ప్రచురించిన వార్షిక నివేదిక(2020)లో గత సంవత్సరంకంటే రెండు స్థానాలు తగ్గి 6.61 స్కోరుతో 53వ స్థానానికి దిగజారింది. ప్రజాస్వామ్య సూచీ పతనానికి నివేదిక రెండు కారణాలను తెలిపింది.

ఒకటి అధికారవర్గం ప్రజాస్వామ్య పద్ధతులను విడనాడి అప్రజాస్వామిక లక్షణాలు ప్రదర్శించడం, రెండోది పౌర హక్కుల అణచివేత చర్యలు తీవ్రతరం కావడం. నార్వే 9.87 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌ దేశాలను ఉత్తమ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా నివేదిక పేర్కొంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సంఘటనలు, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అధిక సంఖ్యాక ప్రజలు పెదవి విరుస్తున్నారు. సంఖ్యాబలంతో ప్రభుత్వాలు పార్లమెంటరీ సంప్రదాయాలను, పద్ధతులను కాలరాచి చట్టాలను, విధానాలను రూపొందించడం వివాదాలకు దారితీస్తోంది. వివాదాస్పద సాగు చట్టాలు రైతుల ఆందోళనకు కారణమయ్యాయి. రాజ్యాంగ వ్యవస్థల కంటే నీతి ఆయోగ్‌ వంటి రాజ్యాంగేతర సంస్థలు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సమాఖ్య స్ఫూర్తికి గండి

రాష్ట్ర జాబితాలోని విద్య, వ్యవసాయం, విద్యుత్‌ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం, జీఎస్‌టీ సంస్కరణల అమలువంటి వాటిని సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు తాయిలాలను ప్రకటించి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చుననే ధీమా రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. సరళీకృత ఆర్థిక సంస్కరణల పేరిట- కార్పొరేటీకరణ విధానాలు మధ్యతరగతి ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టాయి. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో మౌలిక వసతుల కల్పన, సబ్సిడీల రద్దు వంటి చర్యలు సమాజంలో అసమానతలను పెంచాయి. పౌరులు ఓటు వేసి తమ బాధ్యత పూర్తిఅయినట్లుగా భావించకూడదు. నిరంతరం ప్రభుత్వాల పనితీరును సమీక్షించే పరిపక్వత, చైతన్యం ప్రజల్లో ఉండాలి. పౌర సమాజం, మేధావి వర్గం, సామాజిక కార్యకర్తలు చురుగ్గా ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, పదవులను నిర్వహించేవారు హేతుబద్ధ నిర్ణయాలకు, పీడిత ప్రజల ఉద్ధరణకు కట్టుబడి ఉండటంద్వారా సంతృప్తి చెందే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. ప్రజాసేవకులమన్న భావనతో విధులను నిర్వహించినప్పుడే భావి తరాలకు ఆనందకర సమాజాన్ని అందించగలుగుతాం.

- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ (విశ్రాంత అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)

ఇదీ చదవండి : చైనా దూకుడుకు 'క్వాడ్‌' పగ్గాలు

స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణ; రాజ్యాంగబద్ధంగా ఏర్పాటు, శాసనసభల నిర్మాణం మాత్రమే ప్రజాస్వామ్యం కాదు. ప్రభుత్వాలు సంపన్న వ్యక్తులు, వర్గాలకోసం కాకుండా- సమాజంలోని అన్ని వర్గాల ప్రగతికి ప్రభుత్వాలు కృషి చేస్తేనే అది నిజమైన ప్రజాస్వామ్యం అవుతుంది. భిన్న అభిప్రాయాలు, ధోరణుల పట్ల ప్రభుత్వాలు సహనాన్ని ప్రదర్శించాలి. ప్రభుత్వం సక్రమమైన పాలనను అందించనప్పుడు ప్రశ్నించి, నిలదీసి- ప్రజాస్వామ్యం అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రజలదే. ఈ మధ్యకాలంలో భారత ప్రజాస్వామ్యం జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో చర్చనీయాంశం అవుతోంది. సరళీకృత ఆర్థిక సంస్కరణల ప్రతికూల ప్రభావానికి ప్రజలు గురికావడం- పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు గాడి తప్పి నియంతృత్వ పోకడలు చోటుచేసుకోవడం ఇందుకు కారణాలు.

దిగజారిన ‘సూచీ’

బ్రిటన్‌కు చెందిన ఎకనమిక్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాల పనితీరును విశ్లేషిస్తూ 2006 నుంచి ప్రజాస్వామ్య సూచీ వార్షిక నివేదికలను ప్రచురిస్తోంది. ప్రజాస్వామ్య దేశాల్లోని రాజకీయ సంస్కృతి, ప్రభుత్వాల పనితీరు, రాజకీయ భాగస్వామ్యం, పౌర స్వేచ్ఛ వంటి అరవై కొలమానాల ప్రాతిపదికగా దేశాలను వర్గీకరించి- సూచీని రూపొందిస్తారు. ఈ సంస్థ ప్రకటించిన 2014 వార్షిక నివేదికలో పదికి 7.92 స్కోరుతో భారత దేశం 27వ స్థానంలో నిలిచింది. 2019 నివేదికలో ఇండియా 6.9 స్కోరుతో 51వ స్థానంలో ఉంది. 2021 ఫిబ్రవరిలో ప్రచురించిన వార్షిక నివేదిక(2020)లో గత సంవత్సరంకంటే రెండు స్థానాలు తగ్గి 6.61 స్కోరుతో 53వ స్థానానికి దిగజారింది. ప్రజాస్వామ్య సూచీ పతనానికి నివేదిక రెండు కారణాలను తెలిపింది.

ఒకటి అధికారవర్గం ప్రజాస్వామ్య పద్ధతులను విడనాడి అప్రజాస్వామిక లక్షణాలు ప్రదర్శించడం, రెండోది పౌర హక్కుల అణచివేత చర్యలు తీవ్రతరం కావడం. నార్వే 9.87 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్‌, న్యూజిలాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌ దేశాలను ఉత్తమ ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగా నివేదిక పేర్కొంది. భారత్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలు, సంఘటనలు, ప్రభుత్వ పనితీరు పట్ల ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, అధిక సంఖ్యాక ప్రజలు పెదవి విరుస్తున్నారు. సంఖ్యాబలంతో ప్రభుత్వాలు పార్లమెంటరీ సంప్రదాయాలను, పద్ధతులను కాలరాచి చట్టాలను, విధానాలను రూపొందించడం వివాదాలకు దారితీస్తోంది. వివాదాస్పద సాగు చట్టాలు రైతుల ఆందోళనకు కారణమయ్యాయి. రాజ్యాంగ వ్యవస్థల కంటే నీతి ఆయోగ్‌ వంటి రాజ్యాంగేతర సంస్థలు ప్రభుత్వ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.

సమాఖ్య స్ఫూర్తికి గండి

రాష్ట్ర జాబితాలోని విద్య, వ్యవసాయం, విద్యుత్‌ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేయడం, జీఎస్‌టీ సంస్కరణల అమలువంటి వాటిని సమాఖ్య వ్యవస్థకు గొడ్డలిపెట్టుగా రాష్ట్రాలు భావిస్తున్నాయి. ఎన్నికలకు ముందు వివిధ వర్గాలకు తాయిలాలను ప్రకటించి అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చుననే ధీమా రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. సరళీకృత ఆర్థిక సంస్కరణల పేరిట- కార్పొరేటీకరణ విధానాలు మధ్యతరగతి ప్రజలను సమస్యల వలయంలోకి నెట్టాయి. ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణ, ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య నమూనాలో మౌలిక వసతుల కల్పన, సబ్సిడీల రద్దు వంటి చర్యలు సమాజంలో అసమానతలను పెంచాయి. పౌరులు ఓటు వేసి తమ బాధ్యత పూర్తిఅయినట్లుగా భావించకూడదు. నిరంతరం ప్రభుత్వాల పనితీరును సమీక్షించే పరిపక్వత, చైతన్యం ప్రజల్లో ఉండాలి. పౌర సమాజం, మేధావి వర్గం, సామాజిక కార్యకర్తలు చురుగ్గా ఉండాలి. రాజ్యాంగ సంస్థలను, పదవులను నిర్వహించేవారు హేతుబద్ధ నిర్ణయాలకు, పీడిత ప్రజల ఉద్ధరణకు కట్టుబడి ఉండటంద్వారా సంతృప్తి చెందే మనస్తత్వాన్ని అలవరచుకోవాలి. ప్రజాసేవకులమన్న భావనతో విధులను నిర్వహించినప్పుడే భావి తరాలకు ఆనందకర సమాజాన్ని అందించగలుగుతాం.

- డాక్టర్‌ సీహెచ్‌సీ ప్రసాద్‌ (విశ్రాంత అసిస్టెంట్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ)

ఇదీ చదవండి : చైనా దూకుడుకు 'క్వాడ్‌' పగ్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.