ETV Bharat / opinion

టీకా​ తయారీ ఆషామాషీ కాదు.. సవాళ్లు ఎన్నో!

ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనాకు వ్యాక్సిన్​ను తయారు చేసినట్లు ప్రకటించింది రష్యా. అయితే ఈ టీకాపై విమర్శలు చేశారు శాస్త్రవేత్తలు. మూడో దశ క్లినికల్​ పరీక్షలు జరగకుండా ఎలా ప్రకటిస్తారని, వ్యాక్సిన్​ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవని నిర్ధరించటానికి చివరి దశ పరీక్షలే కీలకమని అన్నారు. అసలు క్లినికల్​ పరీక్షలను ఎవరి మీద నిర్వహిస్తారు. ఎంత మంది మీద ప్రయోగిస్తారో తెలుసుకుందామా!

author img

By

Published : Aug 16, 2020, 8:10 AM IST

Challenges of vaccine presentation and delivery
టీకా బాటలో సవాళ్లు ఎన్నో...

కొవిడ్‌ వ్యాధికి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌- 5ను తాము తయారు చేశామని, జనవరికల్లా దాన్ని జనసామాన్యానికి అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించడం కారుచీకట్లో కాంతిరేఖలా భాసించింది. కానీ, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరపకుండానే రష్యా ఈ ప్రకటన చేయడం శాస్త్రజ్ఞులను నివ్వెరపరచింది. వ్యాక్సిన్‌వల్ల దుష్ఫలితాలు ఉండవని నిర్ధారించడానికి మూడో దశ పరీక్షలే కీలకం. ఇక్కడ క్లినికల్‌ పరీక్షల తీరుతెన్నుల గురించి చెప్పుకోవాలి. ఒకటో దశ క్లినికల్‌ పరీక్షలను కొందరు మనుషులపైన, రెండో దశ పరీక్షలను వందల మందిపైన, మూడో దశ పరీక్షలను వేలమందిపైన నిర్వహిస్తారు. టీకావల్ల హానికర ప్రభావాలు ఉండవని నిర్ధారించడానికి మూడో దశ క్లినికల్‌ పరీక్షలే ప్రామాణికం. కానీ, ఈ అంతిమ పరీక్షలు పూర్తికాకముందే రష్యా ప్రభుత్వం స్పుత్నిక్‌ టీకాకు ఎలా ఆమోద ముద్ర వేసిందనేది ప్రశ్న. అయితే తమ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను రష్యాతోపాటు ఇతర దేశాల్లోనూ చేపడుతున్నామని మాస్కో ప్రకటించింది. స్పుత్నిక్‌ టీకాపై భారత్‌తో సహా 20కి పైగా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, మొత్తం 100 కోట్ల డోసులకు గిరాకీ ఉంటుందని తెలిపింది. అక్టోబరు నుంచే టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామంటోంది. స్పుత్నిక్‌ టీకా తిరుగులేకుండా పనిచేస్తుందని రుజువైతే, దాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయడానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, శాంతా బయోటెక్‌, పనసియా బయోటెక్‌, బయొలాజికల్‌ ఇ సంస్థలు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట స్పుత్నిక్‌-5 టీకా భద్రమైనదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యమని ఏఐఐఎంఎస్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా వ్యాఖ్యానించారు. స్పుత్నిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసుకునేవరకు ఆగాలని మాస్కోలోని క్లినికల్‌ పరీక్షల సంఘం (ఏక్టో) కూడా పుతిన్‌ సర్కారును కోరింది.

వ్యాక్సిన్‌ తయారీ మామూలు విషయమా..?

మరోవైపు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తమ టీకాను తీసుకున్న వాలంటీర్లు అందరిలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని, ఏ ఒక్కరిలోనూ ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ప్రకటించారు. ఇంతా చేసి కేవలం 76 మందిపై పరీక్షలు చేసి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు రష్యా అనుమతించింది. భారత్‌లో పతంజలి సంస్థ తమ కరోనా నిరోధక ఔషధాన్ని ఇంతకన్నా ఎక్కువమందిపైనే పరీక్షించి కూడా, ప్రభుత్వ అనుమతి పొందలేకపోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పట్ల నానాటికీ తగ్గిపోతున్న జనాదరణను మళ్లీ పెంచుకోవడానికి స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను జనంపై రుద్దుతున్నారని పాశ్చాత్య దేశాలు రాజకీయ ఆరోపణ చేస్తున్నాయి. కానీ, వ్యాక్సిన్‌ వికటిస్తే ఆ రష్యన్‌ ప్రజానీకమే తనపై తిరగబడుతుందని పుతిన్‌కు తెలియదా అని ఎదురు ప్రశ్న వినబడుతోంది. ఏదిఏమైనా, ఒక వ్యాక్సిన్‌ ప్రయోగశాల నుంచి జనంలోకి రావాలంటే అనేక సంక్లిష్ట దశలను అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా 165 కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్యాండిడేట్లపై ప్రయోగాలు జరుగుతున్నా, వాటిలో అత్యధికం జంతువులపై ప్రయోగానికి సైతం పనికిరాకపోవచ్ఛు ఆగస్టు 12 వరకు 20 క్యాండిడేట్లపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతుండగా, 11 క్యాండిడేట్లపై రెండో దశ, 8 క్యాండిడేట్లపై మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఎనిమిదింటిలోనూ అయిదు టీకాలపై ఆశలు వెల్లివిరుస్తున్నాయి. వీటిని ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా (బ్రిటన్‌), సైనోవ్యాక్‌, సైనో ఫార్మ్‌ (చైనా), మోడెర్నా (అమెరికా) సంస్థలు రూపొందించాయి. వీటిలో సైనో ఫార్మ్‌ సంస్థ రెండు వ్యాక్సిన్‌ క్యాండిడేట్లతో పరీక్షలు నిర్వహిస్తోంది. పైన చెప్పుకొన్న అయిదు టీకాలపై మూడో దశ పరీక్షలు జరుగుతుంటే, ఫైజర్‌-బయాన్‌ టెక్‌ (అమెరికా, జర్మనీల) టీకాపై ఒకేసారి రెండవ, మూడవ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. చైనాకు చెందిన మరో రెండు సంస్థలు రూపొందించిన రెండు టీకాలపై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి.

భారత్​లో తయారీ

భారతదేశానికి వస్తే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థతో కలసి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రూపొందిస్తున్న కొవాక్సిన్‌ టీకాపై మొదటి దశ పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన 20 రోజులకు రెండవ దశ పరీక్షలు నిర్వహిస్తారు. వాటితోపాటే మూడో దశ పరీక్షలూ నిర్వహించబోతున్నారు. కొవాక్సిన్‌పై జులై మొదలుకొని ఇంతవరకు జరిగిన పరీక్షలు సత్ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న కొవిడ్‌ టీకా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి కల్లా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసుకొంటుంది. ఈ రెండు భారతీయ టీకాలపై ఆరు రాష్ట్రాల్లోని ఆరు నగరాల్లో క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. భారత్‌తోపాటు ఇతర దేశాలు నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచుతున్నారు. రష్యా ఆ పని చేయలేదు కనుకనే ఇన్ని అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న టీకాలన్నింటిలోకీ రష్యన్‌ స్ఫుత్నిక్‌ టీకా, చైనీస్‌ క్యాన్‌ సైనో సంస్థ రూపొందించిన ఏడీ5 టీకా మాత్రమే ప్రభుత్వ అనుమతులు పొందాయి. ఏడీ5 టీకాను సంవత్సరంపాటు సైనికులపై ప్రయోగిస్తామని చైనా సైన్యం ప్రకటించింది. చైనీస్‌ టీకాపై సౌదీ అరేబియాలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

ధరవరలు

మోడెర్నా, ఆక్స్‌ ఫర్డ్‌ టీకాలు 2021 సంవత్సరానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండింటితోపాటు నోవావ్యాక్స్‌, సనోఫీ-గ్లాక్సో స్మిత్‌ క్లెన్‌ల వ్యాక్సిన్లను కూడా కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 70 కోట్ల మోతాదుల కోసం ఈ అయిదు సంస్థలకు ఆర్డరు పెట్టింది. కొవిడ్‌ టీకాను ఒకటికన్నా ఎక్కువ డోసులే వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రపంచం నుంచి కరోనా వైరస్‌ను పూర్తిగా పారదోలాలంటే 700 కోట్ల నుంచి 1900 కోట్ల టీకా డోసులు అవసరపడతాయి. కానీ, కొవిడ్‌కు పక్కా టీకా అందుబాటులోకి వచ్చిన తరవాత, దాని ధర పేద దేశాల ప్రజలకు అందుబాటులో ఉంటుందా అన్నది కీలక ప్రశ్న. మోడర్నా టీకా ధర ఒక మోతాదుకు రూ.2,400 నుంచి రూ.2,800 వరకు ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది.

ఆక్స్‌ ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా టీకా ధర ఎంత ఉంటుందో అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో మార్కెట్‌ చేసే సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఒక్కో డోసును రూ.1,000కి సరఫరా చేయగలనని సూచించింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఏటా 150 కోట్ల డోసులను తయారుచేసే సత్తా ఉంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధర రూ.1,500 వరకు ఉంటుంది. సామాన్యులకు ఇంత ధర పోసి కొవిడ్‌ టీకాలను కొనగలిగే స్తోమత ఉండదు కాబట్టి, ప్రభుత్వాలే ఈ ఖర్చును భరించకతప్పదు. తమ టీకా ధర మంచినీటి సీసా ధరకన్నా తక్కువగా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించడం జనబాహుళ్యానికి పెద్ద ఊరట. అలాగే, అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చవకగా కొవిడ్‌ టీకాలను సరఫరా చేయడానికి గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్స్‌ (గావి) సంస్థ, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌లు చేతులు కలిపాయి. 92 దేశాలకు కేవలం రూ.220 (3డాలర్ల) ధరకు టీకాను అందించాలని ఈ సంస్థలు లక్షిస్తున్నాయి. ఆ పని అత్యంత శీఘ్రంగా జరగాలని ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.

- ఏఏవీ ప్రసాద్‌

కొవిడ్‌ వ్యాధికి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌- 5ను తాము తయారు చేశామని, జనవరికల్లా దాన్ని జనసామాన్యానికి అందుబాటులోకి తెస్తామని రష్యా ప్రకటించడం కారుచీకట్లో కాంతిరేఖలా భాసించింది. కానీ, మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరపకుండానే రష్యా ఈ ప్రకటన చేయడం శాస్త్రజ్ఞులను నివ్వెరపరచింది. వ్యాక్సిన్‌వల్ల దుష్ఫలితాలు ఉండవని నిర్ధారించడానికి మూడో దశ పరీక్షలే కీలకం. ఇక్కడ క్లినికల్‌ పరీక్షల తీరుతెన్నుల గురించి చెప్పుకోవాలి. ఒకటో దశ క్లినికల్‌ పరీక్షలను కొందరు మనుషులపైన, రెండో దశ పరీక్షలను వందల మందిపైన, మూడో దశ పరీక్షలను వేలమందిపైన నిర్వహిస్తారు. టీకావల్ల హానికర ప్రభావాలు ఉండవని నిర్ధారించడానికి మూడో దశ క్లినికల్‌ పరీక్షలే ప్రామాణికం. కానీ, ఈ అంతిమ పరీక్షలు పూర్తికాకముందే రష్యా ప్రభుత్వం స్పుత్నిక్‌ టీకాకు ఎలా ఆమోద ముద్ర వేసిందనేది ప్రశ్న. అయితే తమ వ్యాక్సిన్‌పై మూడో దశ క్లినికల్‌ పరీక్షలను రష్యాతోపాటు ఇతర దేశాల్లోనూ చేపడుతున్నామని మాస్కో ప్రకటించింది. స్పుత్నిక్‌ టీకాపై భారత్‌తో సహా 20కి పైగా దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయని, మొత్తం 100 కోట్ల డోసులకు గిరాకీ ఉంటుందని తెలిపింది. అక్టోబరు నుంచే టీకా ఉత్పత్తిని ప్రారంభిస్తామంటోంది. స్పుత్నిక్‌ టీకా తిరుగులేకుండా పనిచేస్తుందని రుజువైతే, దాన్ని భారత్‌లో ఉత్పత్తి చేయడానికి సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, శాంతా బయోటెక్‌, పనసియా బయోటెక్‌, బయొలాజికల్‌ ఇ సంస్థలు సుముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొదట స్పుత్నిక్‌-5 టీకా భద్రమైనదని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యమని ఏఐఐఎంఎస్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా వ్యాఖ్యానించారు. స్పుత్నిక్‌ మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసుకునేవరకు ఆగాలని మాస్కోలోని క్లినికల్‌ పరీక్షల సంఘం (ఏక్టో) కూడా పుతిన్‌ సర్కారును కోరింది.

వ్యాక్సిన్‌ తయారీ మామూలు విషయమా..?

మరోవైపు రష్యా ఆరోగ్య మంత్రి మిఖాయిల్‌ మురాష్కో తమ టీకాను తీసుకున్న వాలంటీర్లు అందరిలో సమృద్ధిగా యాంటీబాడీలు ఉత్పన్నమయ్యాయని, ఏ ఒక్కరిలోనూ ఎలాంటి సమస్యలూ తలెత్తలేదని ప్రకటించారు. ఇంతా చేసి కేవలం 76 మందిపై పరీక్షలు చేసి వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌కు రష్యా అనుమతించింది. భారత్‌లో పతంజలి సంస్థ తమ కరోనా నిరోధక ఔషధాన్ని ఇంతకన్నా ఎక్కువమందిపైనే పరీక్షించి కూడా, ప్రభుత్వ అనుమతి పొందలేకపోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ పట్ల నానాటికీ తగ్గిపోతున్న జనాదరణను మళ్లీ పెంచుకోవడానికి స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ను జనంపై రుద్దుతున్నారని పాశ్చాత్య దేశాలు రాజకీయ ఆరోపణ చేస్తున్నాయి. కానీ, వ్యాక్సిన్‌ వికటిస్తే ఆ రష్యన్‌ ప్రజానీకమే తనపై తిరగబడుతుందని పుతిన్‌కు తెలియదా అని ఎదురు ప్రశ్న వినబడుతోంది. ఏదిఏమైనా, ఒక వ్యాక్సిన్‌ ప్రయోగశాల నుంచి జనంలోకి రావాలంటే అనేక సంక్లిష్ట దశలను అధిగమించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచమంతటా 165 కొవిడ్‌ వ్యాక్సిన్‌ క్యాండిడేట్లపై ప్రయోగాలు జరుగుతున్నా, వాటిలో అత్యధికం జంతువులపై ప్రయోగానికి సైతం పనికిరాకపోవచ్ఛు ఆగస్టు 12 వరకు 20 క్యాండిడేట్లపై మొదటి దశ క్లినికల్‌ పరీక్షలు జరుగుతుండగా, 11 క్యాండిడేట్లపై రెండో దశ, 8 క్యాండిడేట్లపై మూడో దశ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఎనిమిదింటిలోనూ అయిదు టీకాలపై ఆశలు వెల్లివిరుస్తున్నాయి. వీటిని ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా (బ్రిటన్‌), సైనోవ్యాక్‌, సైనో ఫార్మ్‌ (చైనా), మోడెర్నా (అమెరికా) సంస్థలు రూపొందించాయి. వీటిలో సైనో ఫార్మ్‌ సంస్థ రెండు వ్యాక్సిన్‌ క్యాండిడేట్లతో పరీక్షలు నిర్వహిస్తోంది. పైన చెప్పుకొన్న అయిదు టీకాలపై మూడో దశ పరీక్షలు జరుగుతుంటే, ఫైజర్‌-బయాన్‌ టెక్‌ (అమెరికా, జర్మనీల) టీకాపై ఒకేసారి రెండవ, మూడవ క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. చైనాకు చెందిన మరో రెండు సంస్థలు రూపొందించిన రెండు టీకాలపై రెండో దశ పరీక్షలు జరుగుతున్నాయి.

భారత్​లో తయారీ

భారతదేశానికి వస్తే హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థతో కలసి భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) రూపొందిస్తున్న కొవాక్సిన్‌ టీకాపై మొదటి దశ పరీక్షలు జరుగుతున్నాయి. అవి పూర్తయిన 20 రోజులకు రెండవ దశ పరీక్షలు నిర్వహిస్తారు. వాటితోపాటే మూడో దశ పరీక్షలూ నిర్వహించబోతున్నారు. కొవాక్సిన్‌పై జులై మొదలుకొని ఇంతవరకు జరిగిన పరీక్షలు సత్ఫలితాలను ఇచ్చాయని అధికారులు తెలిపారు. అహ్మదాబాద్‌కు చెందిన జైడస్‌ క్యాడిలా రూపొందిస్తున్న కొవిడ్‌ టీకా వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చి కల్లా మూడో దశ క్లినికల్‌ పరీక్షలు పూర్తిచేసుకొంటుంది. ఈ రెండు భారతీయ టీకాలపై ఆరు రాష్ట్రాల్లోని ఆరు నగరాల్లో క్లినికల్‌ పరీక్షలు జరుగుతున్నాయి. భారత్‌తోపాటు ఇతర దేశాలు నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అంతర్జాతీయ శాస్త్రవేత్తల పరిశీలనకు అందుబాటులో ఉంచుతున్నారు. రష్యా ఆ పని చేయలేదు కనుకనే ఇన్ని అనుమానాలకు ఆస్కారం ఏర్పడింది. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్న టీకాలన్నింటిలోకీ రష్యన్‌ స్ఫుత్నిక్‌ టీకా, చైనీస్‌ క్యాన్‌ సైనో సంస్థ రూపొందించిన ఏడీ5 టీకా మాత్రమే ప్రభుత్వ అనుమతులు పొందాయి. ఏడీ5 టీకాను సంవత్సరంపాటు సైనికులపై ప్రయోగిస్తామని చైనా సైన్యం ప్రకటించింది. చైనీస్‌ టీకాపై సౌదీ అరేబియాలో మూడో దశ క్లినికల్‌ పరీక్షలు జరగనున్నాయి.

ధరవరలు

మోడెర్నా, ఆక్స్‌ ఫర్డ్‌ టీకాలు 2021 సంవత్సరానికి అందుబాటులోకి రానున్నాయి. ఈ రెండింటితోపాటు నోవావ్యాక్స్‌, సనోఫీ-గ్లాక్సో స్మిత్‌ క్లెన్‌ల వ్యాక్సిన్లను కూడా కొనుగోలు చేయడానికి అమెరికా ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. మొత్తం 70 కోట్ల మోతాదుల కోసం ఈ అయిదు సంస్థలకు ఆర్డరు పెట్టింది. కొవిడ్‌ టీకాను ఒకటికన్నా ఎక్కువ డోసులే వేయాల్సి ఉంటుంది. ఈ లెక్కన ప్రపంచం నుంచి కరోనా వైరస్‌ను పూర్తిగా పారదోలాలంటే 700 కోట్ల నుంచి 1900 కోట్ల టీకా డోసులు అవసరపడతాయి. కానీ, కొవిడ్‌కు పక్కా టీకా అందుబాటులోకి వచ్చిన తరవాత, దాని ధర పేద దేశాల ప్రజలకు అందుబాటులో ఉంటుందా అన్నది కీలక ప్రశ్న. మోడర్నా టీకా ధర ఒక మోతాదుకు రూ.2,400 నుంచి రూ.2,800 వరకు ఉంటుందని ఆ కంపెనీ తెలిపింది.

ఆక్స్‌ ఫర్డ్‌- ఆస్ట్రాజెనెకా టీకా ధర ఎంత ఉంటుందో అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ వ్యాక్సిన్‌ను భారత్‌లో మార్కెట్‌ చేసే సీరమ్‌ ఇన్‌ స్టిట్యూట్‌ ఒక్కో డోసును రూ.1,000కి సరఫరా చేయగలనని సూచించింది. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు ఏటా 150 కోట్ల డోసులను తయారుచేసే సత్తా ఉంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ ధర రూ.1,500 వరకు ఉంటుంది. సామాన్యులకు ఇంత ధర పోసి కొవిడ్‌ టీకాలను కొనగలిగే స్తోమత ఉండదు కాబట్టి, ప్రభుత్వాలే ఈ ఖర్చును భరించకతప్పదు. తమ టీకా ధర మంచినీటి సీసా ధరకన్నా తక్కువగా ఉంటుందని భారత్‌ బయోటెక్‌ ప్రకటించడం జనబాహుళ్యానికి పెద్ద ఊరట. అలాగే, అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు చవకగా కొవిడ్‌ టీకాలను సరఫరా చేయడానికి గ్లోబల్‌ అలయన్స్‌ ఫర్‌ వ్యాక్సిన్స్‌ అండ్‌ ఇమ్యునైజేషన్స్‌ (గావి) సంస్థ, సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, బిల్‌ అండ్‌ మెలిండా గేట్స్‌ ఫౌండేషన్‌లు చేతులు కలిపాయి. 92 దేశాలకు కేవలం రూ.220 (3డాలర్ల) ధరకు టీకాను అందించాలని ఈ సంస్థలు లక్షిస్తున్నాయి. ఆ పని అత్యంత శీఘ్రంగా జరగాలని ప్రపంచమంతా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది.

- ఏఏవీ ప్రసాద్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.