పొగచూరుతున్న వంట గదుల్లోని కాలుష్యం- గ్రామీణంలో ప్రజారోగ్యాన్ని అతలాకుతలం చేస్తున్న పరిస్థితుల్లో దాదాపు మూడున్నర దశాబ్దాల కిందటే బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు దేశంలో పెద్ద కృషి జరిగింది. పశు వ్యర్థాలతో పల్లెల్లో బయోగ్యాస్ అప్పట్లో ఒక ప్రభంజనం సృష్టించిందనే చెప్పాలి. కాలం గడుస్తున్న కొద్దీ పలు రాష్ట్రాల్లో పోషణ భారమై అత్యధిక శాతం రైతులు పశువులను వదిలేయడంతో చాలావరకు ప్లాంట్లు మూతపడ్డాయి. సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఒక ఉద్యమంలా చేపట్టిన ఈ బృహత్తర యజ్ఞం నిర్వీర్యమవుతుందనే సందేహాలు తలెత్తాయి. నేడు బయోగ్యాస్ బహుళ ప్రయోజకర ఇంధనంగా రూపాంతరం చెందడం కొత్త ఆశలు చివురింపజేస్తోంది.
రెండో స్థానంలో భారత్
ఆర్థిక వ్యవస్థపై పెట్రో ధరల భారం పెరుగుతున్న నేపథ్యంలో రేపటి తరాలకు ఇటువంటి సంప్రదాయేతర ఇంధన వనరులే సరైన ప్రత్యామ్నాయం కానున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో కట్టెల పొయ్యిల నుంచి వచ్చే పొగ పీల్చి గృహిణులు కళ్లు, శ్వాసకోశ సంబంధిత వ్యాధుల బారిన పడేవారు. మరోవైపు వంటచెరకు కోసం అడవుల నరికివేతతో పర్యావరణం పెను ప్రమాదంలో పడుతోంది. బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటైన తొలినాళ్లలో వంటగ్యాస్, విద్యుత్దీపాలు వెలిగించుకునేలా వాటిని విస్తృతంగా ప్రోత్సహించారు. తరవాత లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) వాడకం పెరిగింది. చమురు దీపాల స్థానంలో విద్యుత్ దీప కాంతులు విరజిమ్మాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నా నేటికీ విద్యుత్ సదుపాయం లేని గ్రామాలూ ఉన్నాయి. దేశ అవసరాలకు సరిపడా విద్యుదుత్పత్తి సాధించాలంటే సంప్రదాయేతర ఇంధన వనరులే శరణ్యమని కేంద్రప్రభుత్వం భావించింది. గతంలో దేశంలో 90శాతం థర్మల్ విద్యుత్తే ఉండేది. హైడ్రో, సౌర, గ్యాస్, అణు విద్యుదుత్పత్తి 10శాతం కూడా దాటేది కాదు. రెండు దశాబ్దాలుగా జరిగిన కృషి వల్ల నేడు థర్మల్ విద్యుదుత్పత్తి 58శాతానికి తగ్గగా- హైడ్రో, గ్యాస్, అణు విద్యుదుత్పత్తి 29శాతానికి పెరిగింది. సంప్రదాయేతర వనరుల నుంచి 13శాతం విద్యుదుత్పత్తిని సాధించగలిగాం. రానున్న పదేళ్లలో దేశంలో సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి పెద్దపీట వేసే లక్ష్యంతో ప్రభుత్వాలు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఈ కృషి వల్ల నేడు ప్రపంచ బయోగ్యాస్ ప్లాంట్ల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగంలో అయిదో స్థానం పొందింది.
దేశంలో 2023 నాటికి అయిదు వేల కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ) ప్లాంట్ల ఏర్పాటు లక్ష్యాన్ని 2018లో కేంద్రం ప్రకటించింది. మరోవైపు దేశంలో 2019 మార్చి 31 నాటికి కుటుంబ అవసరాలకు వాడుకునే దాదాపు 50 లక్షల బయోగ్యాస్ ప్లాంట్లను జాతీయ బయోగ్యాస్ సేంద్రియ ఎరువుల కార్యక్రమం (ఎన్ఎన్బీఓఎంపీ) కింద ఏర్పాటు చేశారు. రోజుకు ఒకటి నుంచి 25 ఘనపు మీటర్ల సామర్థ్యం ఉన్న బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల మంత్రిత్వశాఖ ఎన్ఎన్బీఓఎంపీ కింద రాయితీలు అందిస్తోంది. రూ.20 లక్షల విలువ చేసే ఒక డెయిరీ ప్లాంట్కోసం 40శాతం అంటే- ఎనిమిది లక్షల రూపాయల వరకు సబ్సిడీని అందిస్తున్నారు. విద్యుత్పై పెట్టే ఖర్చులో నెలకు రూ.90 వేల వరకు ఈ బయోగ్యాస్ప్లాంట్ వల్ల ఆదా అవుతుంది. గృహ అవసరాల కోసం ఎన్ఆర్ఈడీపీ రూ.22 వేలు ఖర్చయ్యే ఒక ఘనపు మీటరు బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.5500, ఎస్సీ ఎస్టీలకు ఏడువేల రూపాయల వరకు సబ్సిడీని అందిస్తున్నారు. బయోగ్యాస్ప్లాంట్ల వల్ల గుజరాత్, మహారాష్ట్రల్లో వేల టన్నుల వంట చెరకు ఆదా అవుతోంది. దేశంలోని 47 లక్షల కుటుంబాలకు ఉన్న బయోగ్యాస్ ప్లాంట్లు ప్రధానంగా పశువుల ఎరువుతోనే నడుస్తున్నాయి. దీన్ని ప్రధానంగా వంటగ్యాస్గా వాడుతున్నారు. పశువుల ఎరువు, ఇతర వ్యర్థాలతో నడిచే మధ్య తరహా ప్లాంట్లను ఎక్కువగా విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్నారు.
రైతు లోకానికి మేలు
దేశంలోని వ్యవసాయ, పట్టణ, పశువుల వ్యర్థాల నుంచి బయోగ్యాస్ ఉత్పత్తిని పెంచగలిగితే రానున్న కాలంలో బొగ్గు, పెట్రో ఉత్పత్తులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోగలం. 2030 నాటికి ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని పెంచుకోవడం మనకు తప్పనిసరి. దీనిలో భాగంగా ప్రస్తుతం 6.5శాతంగా ఉన్న సహజ వాయువును అప్పటికి 15శాతానికి పెంచే యత్నాలను భారత్ ముమ్మరం చేసింది. వచ్చే రెండేళ్లలో- ఒకటిన్నర కోట్ల టన్నుల సీబీజీని ఉత్పత్తి చేసే అయిదు వేల ప్లాంట్లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. వ్యవసాయ, పశు వ్యర్థాలను సేంద్రియ ఎరువులు, బయోడీజిల్, బయోగ్యాస్, సీబీజీ, సహజ వాయువులను ఉత్పత్తి చేసి వాటితో వ్యవసాయ యంత్రాలను నడపడం, ఆధారిత పరిశ్రమలకు విద్యుత్తును ఉపయోగించే కృషిని పెంచగలిగితే రైతు లోకానికి ఎంతో మేలు చేకూరుతుంది. కుటుంబ, వ్యవసాయ అవసరాలకు వాడే ఇంధనాలపై వ్యయం తగ్గి ఆదాయ స్థిరత్వం సాధ్యపడుతుంది. గ్రామీణుల ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ చూపితే అన్ని రకాల వ్యర్థాలకు కొత్త అర్థాన్ని ఇవ్వవచ్చు.
డీజిలుకు ప్రత్యామ్నాయం!
బయోగ్యాస్లో 55-65శాతం మీథేన్, 35-45శాతం కార్బన్డయాక్సైడ్ ఉంటాయి. బయోగ్యాస్ నుంచి వచ్చే మీథేన్ వాయువును అధిక పీడనంతో సిలిండర్లలో నింపి- కంప్రెస్డ్ బయోగ్యాస్(సీబీజీ)గా వాహనాల ఇంధనంగా ఉపయోగిస్తున్నారు. బయో వ్యర్థాలను ఉపయోగించి బయోగ్యాస్, సీఎన్జీ, సీబీజీ, ఆర్ఎన్జీ ప్లాంట్ల ద్వారా ప్రత్యామ్నాయ ఇంధనాలను ఉత్పత్తి చేస్తున్నారు. డీజిలుకు ప్రత్యామ్నాయంగా 80-100శాతం వరకు బయోగ్యాస్ ఇంజిన్లను వాడుతున్నారు. వ్యవసాయ, పశువుల వ్యర్థాలను బయోడీజిలుగా మార్చి ట్రాక్టర్లు, సాగు యంత్రాలకు వాడుకోవడంతో పాటు సేంద్రియ ఎరువుల తయారీని విస్తృతంగా చేపట్టవచ్చు. ఏటా దేశంలోని సుమారు 130 కోట్ల టన్నుల బయోమాస్ వ్యర్థాలను శాస్త్రీయంగా వినియోగించడం ద్వారా పర్యావరణానికి చెరుపు చేసే కొన్ని కోట్ల టన్నుల కర్బన వాయువులను తగ్గిస్తున్నారు. దీన్నుంచి దాదాపు 66 కోట్ల టన్నుల సేంద్రియ ఎరువుల్ని, ఏడు కోట్ల టన్నుల బయో-సీఎన్జీని ఉత్పత్తి చేస్తున్నారు. పలు రకాల పంటల నుంచి ఇథనాల్ తయారు చేసి ఇంధనంగా వాడుతున్నారు. వ్యర్థాలను సేంద్రియ ఎరువుల తయారీకి వాడుతుండటంతో రసాయన ఎరువులపై పెట్టే ఖర్చుకూడా తగ్గే అవకాశముంది. ఇలాంటి సరికొత్త ప్రయోజనాల అన్వేషణతో బయోగ్యాస్ ప్లాంట్ల వాడకాన్ని మరింత పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది.
- అమిర్నేని హరికృష్ణ
ఇదీ చూడండి: మోదీ పాలనకు పట్టం- ప్రపంచ స్థాయిలో టాప్ ర్యాంక్