న్యూట్రిషనిస్ట్గా, క్లినికల్ డైటీషియన్గా, పిలాటిస్ గురూగా, రచయితగా.. ఇలా బహుముఖ ప్రజ్ఞ సొంతం చేసుకున్నారు రాధికా కర్లె. సీజన్ను బట్టి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు, ఫిట్నెస్ కోసం చేయాల్సిన వ్యాయామాలు, ఆరోగ్యకరమైన వంటకాలు.. వంటివన్నీ సోషల్ మీడియా పోస్టుల రూపంలో పంచుకుంటూ అందరిలో ఆరోగ్య స్పృహ పెంచుతున్నారామె. అంతేకాదు.. సోనమ్ కపూర్, హ్యూమా ఖురేషీ.. వంటి బాలీవుడ్ తారలకు డైట్, ఫిట్నెస్ టిప్స్ సూచిస్తుంటారు రాధిక. ఇక ఫిట్నెస్పై పలు పుస్తకాలు రచించి.. మంచి రచయిత్రిగానూ పేరు సంపాదించుకున్నారీ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు. తన సోషల్ మీడియా పోస్టులతో ఆరోగ్యం పట్ల అందరిలో అవగాహన పెంచే ఈ ఫిట్నెస్ మామ్.. ఇటీవలే వర్షాకాలంలో మన ఆహారంలో చేసుకోవాల్సిన మార్పులేంటో వివరిస్తూ మరో పోస్ట్ పెట్టారు.
ఆహారమే మన ఆరోగ్యం!
వర్షాకాలం అనగానే అందరిలో ఒక రకమైన అసహనం ఆవహిస్తుంది. ఇందుకు కారణం వాతావరణంలో కలిగే మార్పులే! ఇలాంటి అసహనాన్ని మనం తీసుకునే ఆహారంతో తరిమికొట్టచ్చంటున్నారు రాధిక. తద్వారా దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా, ఫిట్గా, సురక్షితంగా ఉండచ్చంటూ ఈ కాలంలో తీసుకోవాల్సిన డైట్ గురించి ఇన్స్టా పోస్ట్ ద్వారా ఇలా పంచుకున్నారు.
‘వాతావరణం మారినప్పుడు అందుకు అనుగుణంగా మనం తీసుకునే ఆహారంలోనూ మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలా మనం ఈ సమయంలో తీసుకునే ఆహారం మనల్ని దీర్ఘకాలం పాటు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. అవేంటంటే..!
విటమిన్ ‘సి’ ఇలా!
ఈ కాలంలో ముఖ్యంగా విటమిన్ ‘సి’ అధికంగా ఉండే ఆహార పదార్థాలను మెనూలో చేర్చుకోవాలి. క్యాప్సికం, బొప్పాయి, నిమ్మకాయ.. వంటి వాటిలో ఈ విటమిన్ అధికంగా లభిస్తుంది. అలాగే టొమాటో, క్యాప్సికం కొద్దిగా వేయించుకొని చట్నీ చేసుకొని తింటే అటు రుచికి రుచి, ఇటు ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ అందుతాయి.
బయట వద్దు.. ‘కిచిడీ’ ముద్దు!
ఈ కాలంలో బయట తినడం ఎంత మానుకుంటే అంత మంచిది. ఇంట్లోనే సులభంగా చేసుకోదగిన, తేలిగ్గా జీర్ణమయ్యే వంటకాల్ని తయారుచేసుకొని తీసుకోవచ్చు. మనమెంతో ఇష్టంగా తినే కిచిడీ అదే కోవలోకి వస్తుంది. అయితే కిచిడీ తయారీలో కొన్ని బియ్యానికి బదులు జొన్నలు, తోటకూర గింజలు (అమరాంత్/రాజ్గిరా).. వంటివి ఉపయోగిస్తే అదనపు ప్రొటీన్ మన శరీరానికి అందుతుంది. అలాగే ఈ కిచిడీ కూడా ఎప్పటికప్పుడు వేడివేడిగా తయారుచేసుకొని తీసుకోవడం మంచిది.
రోగనిరోధక శక్తి కోసం..
వాతావరణంలో కలిగే మార్పులు మన రోగనిరోధక వ్యవస్థపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. అందుకే మన ఈ రక్షణ వ్యవస్థను కాపాడుకోవాలంటే మన వంటింట్లోనే బోలెడన్ని పదార్థాలున్నాయి. పసుపు, మిరియాలు, అల్లం, వెల్లుల్లి.. ఇవన్నీ ఆ కోవలోకే వస్తాయి. వీటిని రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఉదయం పూట తీసుకునే గోరువెచ్చటి నీళ్లలో నిమ్మరసంతో పాటు సన్నగా కట్ చేసిన కొన్ని అల్లం స్లైసులు వేసుకుంటే రోజంతా చురుగ్గా ఉండచ్చు.
దాహం వేయకపోయినా..
వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల చాలామంది నీళ్లు తాగడానికి ఆసక్తి చూపించరు. కానీ ఈ కాలంలో దాహం వేసినా, వేయకపోయినా నీళ్లు తాగాల్సిందే! తద్వారా శరీరం డీహైడ్రేషన్కి గురికాకుండా జాగ్రత్తపడచ్చు.. లేదంటే వేడి చేయడం, మూత్రం పసుపు రంగులో రావడం.. వంటి సమస్యలు తలెత్తుతాయి.
తొక్క తొలగించేవైతేనే..!
అన్ని కాయగూరల్ని ఆవిరిపై ఉడికించుకోవడం, గ్రిల్ చేసుకోవడం, తక్కువ నూనెతో ఫ్రై చేసుకోవడం.. వంటివి చేయడం తప్పనిసరి. ఇక పండ్ల విషయానికొస్తే.. అరటి, కమలాఫలం, పుచ్చకాయ.. వంటి తొక్క తొలగించే పండ్లను ఈ కాలంలో ఎక్కువగా తీసుకోవడం శ్రేయస్కరం!’ అంటూ వర్షాకాలంలో ఆహారం విషయంలో చేసుకోవాల్సిన మార్పులు-చేర్పుల గురించి చెప్పుకొచ్చారు రాధిక.
ఇవి గుర్తుంచుకోండి!
- కాలమేదైనా ఉప్పు మితంగా తింటేనే మంచిది. లేదంటే ఎక్కువ శాతం ఉప్పు మన శరీరంలోకి చేరి హైపర్టెన్షన్, థైరాయిడ్ సమస్యలకు దారితీస్తుంది.
- ఈ కాలంలో జీర్ణక్రియ చాలా నెమ్మదిగా ఉంటుంది. అలాంటప్పుడు సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవడం మంచిది. అలాకాకుండా మసాలాలు, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారమైతే త్వరగా జీర్ణం కాక అజీర్తి, గ్యాస్.. వంటి జీర్ణ సంబంధిత సమస్యలకు కారణమవుతుంది.
- ప్రస్తుత వాతావరణం బ్యాక్టీరియా, వైరస్లు వృద్ధి చెందేందుకు అనుకూలంగా ఉంటుంది. అందుకు అవి ఆకుకూరల్నే ఆవాసంగా ఏర్పరచుకుంటాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి వాటిని తీసుకునే ముందు ఉప్పు నీటిలో బాగా కడిగి, అధిక ఉష్ణోగ్రత వద్ద ఉడికించుకొని తీసుకోవడం మేలంటున్నారు.
గమనిక: ఇవండీ.. వర్షాకాలానికి తగినట్లుగా మన మెనూలో చేసుకోవాల్సిన కొన్ని మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు! అయితే ఆహారం విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పలు అనారోగ్యాలు చుట్టుముడతాయి. పైగా ఇప్పుడు కరోనా కూడా విజృంభిస్తోంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయకుండా.. ఎలాంటి చిన్నపాటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యులను సంప్రదించాలన్న విషయం మర్చిపోవద్దు.
ఇదీ చదవండి: ఆన్లైన్లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!