ఈత సరదా ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. స్నేహితునితో కలిసి ఈతకు పోయి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు ఓ యువకుడు. తనకు ఈత రాదని తెలిసిప్పటికీ ఈత కొట్టేందుకు ప్రయత్నించగా... నీటిలో మునిగి శవమై తేలాడు. ఈ ఘటనతో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఏం జరిగింది?
పంజాల మహేశ్ అనే యువకుడు తన స్నేహితుడు మణితేజరెడ్డితో కలిసి అర్కండ్ల వాగులో ఈతకు వెళ్లారు. ఈత రాదని తెలిసినప్పటికీ స్నేహితుడితో కలిసి ఈత కొట్టేందుకు ప్రయత్నించారు. వాగులోనే మునిగిపోయాడు. ఇది గమనించిన తోటి స్నేహితుడు గ్రామస్థులకు సమాచారం అందించారు.
స్థానికులు వాగు వద్దకు చేరుకొని గాలించగా... మహేశ్ మృతదేహం లభ్యమైంది. మృతుని కుటుంబసభ్యులు వాగు వద్దకు చేరుకొని బోరున విలపించారు. కేశవపట్నం ఎస్సై వరంగంటి రవి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.