అర్ధరాత్రి వేళ అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయాన అతడు పని మొదలెడతాడు.. తాళం వేసి ఉన్న కార్యాలయాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడతాడు. మూడో కంటికి తెలియకుండా చాకచక్యంగా సొత్తు ఎత్తుకెళ్తాడు. చివరికి నిఘానేత్రానికి చిక్కాడు. బేగంపేట్లో శుక్రవారం అర్ధరాత్రి పలు కార్యాలయాల్లో చోరీ చేసిన నిందితుడు అందినకాడికి దోచుకెళ్లాడు.
ఇలా జరిగింది..
ఎయిర్ లైన్ కాలనీలో కూకట్పల్లికి చెందిన రాఠోడ్ మూడేళ్ల నుంచి రాయల్కార్గో కార్యాలయం నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం స్థలం కొనుగోలు కోసం రూ.28 లక్షలు తీసుకొచ్చి కార్యాలయంలోని బీరువాలో దాచాడు. శనివారం ఆ మొత్తాన్ని స్థల యజమానికి ఇవ్వాల్సి ఉంది. శుక్రవారం రాత్రి 12 గంటల వరకు వ్యాపారం నిర్వహించి.. కార్యాలయానికి తాళం వేసి ఇంటికి వెళ్లిపోయాడు. శనివారం ఉదయం తాళం విరిగి ఉందని స్థానికుల సమాచారంతో వచ్చి చూడగా... బీరువాలో సొమ్ము మాయమైంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కార్యాలయంలోని సీసీటీవీ చిత్రాలను పరిశీలించగా చేతికి గ్లౌజులు, ముసుగు ధరించిన వ్యక్తి తెల్లవారుజామున మూడుగంటల అనంతరం తాళం పగులగొట్టి క్షణాల్లోనే సొత్తు ఎత్తుకెళ్లడం రికార్డయింది. ఇదే విధంగా ఈ ప్రాంతంలోనే మరో ఐదు కార్యాలయాల్లో దొంగతనం చేశాడు. ఓచోట రూ.5వేలు, మరో చోట రూ.8వేలు, ఇంకో ఆఫీసులో రూ.10 వేలు ఇలా అందిన కాడికి దోచుకెళ్లాడు. ఇదంతా శనివారం తెల్లవారుజాము 2 నుంచి 4 గంటల ప్రాంతంలో జరిగింది. ఈ దృశ్యాలు ఈ కాలనీలో పలు ఇళ్ల ముందున్న సీసీ టీవీల్లో నిందితుడి ఆనవాళ్లు రికార్డయ్యాయి.
దొంగతనాలకు పాల్పడింది పాత నేరస్థుడా... అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడుని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. త్వరలోనే అరెస్టు చేస్తామని ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇదీ చూడండి: ఎందుకీ తొందర: నిమిషం ఆగితే ఐదుగురు ప్రాణాలు నిలిచేవి