రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పొరుగుసేవల సిబ్బందితో కలిసి దోపిడీకి పాల్పడుతున్న ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.3 లక్షల 20 వేల నగదు, ల్యాప్టాప్, ప్రింటర్, 9 చరవాణులను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ వే బిల్లులు సృష్టించి యథేచ్ఛగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.
లారీలో ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో సోదాలు జరిపామని పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇసుక మాఫియా, నకిలీ వే బిల్లుల తయారీపై డ్రైవర్ను విచారించినట్లు వెల్లడించారు. నిందితులు నవీన్, కిరణ్, రాజశేఖర్ ఇసుక రాకెట్ను నడిపిస్తున్నారని వివరించిన ఆయన.. లారీ యజమానిని పిలిపించి విచారించామని తెలిపారు. ఏటూరు నాగారంలో నిందితులను పట్టుకున్నామని వివరించారు.
గుత్తేదారు కిరణ్కుమార్ మార్చి నుంచి ఇసుక క్వారీ నిర్వహిస్తున్నాడని సీపీ పేర్కొన్నారు. మల్యాల క్వారీ నుంచి ఇప్పటి వరకు సుమారు 500 లారీల ఇసుకను అక్రమంగా తరలించారన్నారు. జనవరి నుంచి జూన్ వరకు రూ.15 లక్షలకు క్వారీని లీజుకు తీసుకున్నారన్న ఆయన.. మణుగూరులో మరో క్వారీ వద్ద నకిలీ బిల్లులు సృష్టించారని స్పష్టం చేశారు.