మహిళ అత్యాచారం కేసులో పంజాగుట్ట పోలీసులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. 139 మంది తనపై గత తొమ్మిదేళ్లుగా లైంగిక దాడి చేశారని ఫిర్యాదు చేసిన వ్యవహారంలో 49 పేజీల ఎఫ్ఐఆర్ను పోలీసులు ఇప్పటికే నమోదు చేశారు. ఈ కేసులో ఎలా ముందుకు వెళ్లాలని అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. విచారణ ఎవరికీ అప్పగించాలనే అంశంపై కసరత్తు చేస్తున్నారు.
మిర్యాలగూడకు చెందిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసిన జాబితాలో ప్రముఖుల పేర్లు కూడా ఉండడం కలకలం రేపుతోంది. దీంతో అందరి దృష్టి ఈ కేసుపై పడింది. పోలీసు ఉన్నతాధికారులు న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకున్న తర్వాతే అడుగు ముందుకేయాలని భావిస్తున్నారు. డీజీపీ మహేందర్రెడ్డి అనుమతిస్తే కేసు దర్యాప్తును సీఐడీకి అప్పగించాలని అనుకుంటున్నారు. లేని పక్షంలో కేసును పంజాగుట్ట నుంచి సీసీఎస్కు బదిలీ చేయాలని నిర్ణయించారు.
పోలీసులు బాధితురాలికి కౌన్సిలింగ్ నిర్వహించడంతో పాటు మేమున్నామని భరోసా ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు గుర్తించారు. తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటే మరింత సమాచారం బయటకు వస్తుందని భావిస్తున్నారు.
ప్రస్తుతం బాధితురాలు ఓ స్వచ్ఛంద సేవా సంస్థలో ఆశ్రయం పొందుతోంది. ఈ సంస్థ నిర్వాహకుడి సాయంతోనే ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో పోలీసులు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నారు.
- సంబంధిత కథనం: యువతిపై 139 మంది బలాత్కారం.. పంజాగుట్టలో ఫిర్యాదు!