గుప్తనిధుల కోసం దేవాలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేసే ముఠాను ఆంధ్రప్రదేశ్లో నందిగామ పోలీసులు అరెస్ట్ చేశారు. సిట్ అధికారి డీఐజీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. మూఢనమ్మకాలతో పురాతన ఆలయాల్లోని విగ్రహాలను ధ్వంసం చేస్తున్న.. రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏడుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
మక్కపేటలో అపహరణ వీరి పనే...
వత్సవాయి మండలం మక్కపేటలో ఉన్న అతి పురాతనమైన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో.. గతేడాది సెప్టెంబర్ 16న నంది విగ్రహం చెవులను ఈ గ్యాంగ్ అపహరించి ఎర్రగట్టు తీసుకెళ్లారని ఎస్పీ తెలిపారు. చెవిలో వజ్రాలు ఉన్నాయని భావించిన నిందితులు వాటిని పగలగొట్టి చూశారని.. వాటిలో ఏమీ లేకపోవడంతో హైదరాబాద్ వెళ్లిపోయారని తెలిపారు. ఈ విగ్రహాన్ని తిరిగి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా ఏడుగురుని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
ముఠా వివరాలు సేకరించాం...
తెలుగు రాష్ట్రాల్లోని తొమ్మిది ఆలయాల్లో విగ్రహాల దోపిడీకి ఈ ముఠా రెక్కీ నిర్వహించిందని రవీంద్రనాథ్ బాబు తెలిపారు. పురాతన ఆలయాల్లోని విగ్రహాల్లో వజ్రాలు, ఇతర ఆభరణాలు ఉంటాయని భావించి.. ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయాల్లో దాడులకు పాల్పడే వారి వివరాలను.. ఈ ముఠా నుంచి సేకరించినట్లు చెప్పారు. ఈ విషయంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామన్నారు.
ఇదీ చదవండి: అసహజ బంధానికి పెద్దలు నిరాకరణ.. యువతి బలవన్మరణం