కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఇసాయిపేట్లో మేకల మందపై చిరుతపులి దాడి చేసింది. ఘటనలో ఓ మేక చనిపోయింది.
గ్రామానికి చెందిన గొల్ల పర్శయ్య ఆదివారం సాయంత్రం మేకలను మేత కోసం గ్రామ శివారులోని అడవిలోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలో చిరుతపులి ఒక్కసారిగా మేకల మందపై దాడి చేసింది. ఒక మేకను చంపేసి.. మరో దానిని లాక్కెళ్తుండగా పర్శయ్య గమనించి చిరుతను తరిమాడు. అనంతరం ఊళ్లోకి వచ్చి స్థానికులకు విషయం తెలిపాడు.
గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు గ్రామ శివారులో బోను ఏర్పాటు చేశారు. ఈ అటవీ ప్రాంతంలో 11 చిరుతలను గుర్తించినట్లు తెలిపారు. గ్రామస్థులెవరూ 15 రోజుల వరకు అడవిలోకి వెళ్లొద్దని హెచ్చరించారు.