సిద్దిపేట జిల్లా కేంద్రంలో పగటిపూట రెండు అపార్ట్మెంట్లలోని ఫ్లాట్లలో జరిగిన చోరీలను సిద్దిపేట వన్టౌన్ పోలీసులు 11 రోజుల్లో ఛేదించారు. ఈ ఘటనలో నిందితుడైన అంతర్రాష్ట్ర దొంగను రిమాండ్కు తరలించారు. గత నెల 27న సిద్దిపేట శివాజీనగర్లో తాళం వేసిన ఫ్లాట్లలో పగటిపూట గుర్తుతెలియని వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
తనిఖీ చేస్తుండగా..
పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద ఓ లాడ్జీని తనిఖీ చేస్తుండగా.. హైదరాబాద్ పరిధి రహ్మత్నగర్కు చెందిన వి.ఆనంద్ అనుమానాస్పదంగా కనిపించాడు. అదుపులోకి తీసుకొని విచారించగా రెండు చోరీలు చేసినట్లు తేలింది. అతని వద్ద 6.50 తులాల బంగారు, 17 తులాల వెండి ఆభరణాలు, రూ.10 వేలు స్వాధీనం చేసుకున్నారు.
26 దొంగతనాలు..
నిందితుడు నృత్యశిక్షకుడిగా పని చేస్తూ జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలోనే దొంగతనాలు అలవర్చుకున్నాడు. 2011 నుంచి హైదరాబాద్, నల్గొండ, కరీంనగర్, రాజమండ్రి తదితర పట్టణాల్లో 26 దొంగతనాలు చేసి జైలు శిక్ష అనుభవించాడు. చోరీని ఛేదించిన సీఐతో పాటు ఎస్ఐ మహిపాల్రెడ్డి, ఐడీ పార్టీ సిబ్బంది రాంజీ, కనకరాజు, శివ, పరంధాములు, జగన్లను ఏసీపీ అభినందించారు.