క్రైం సినిమాలు, సీఐడీ కార్యక్రమాల్లో చూపించినట్లు తాగి పడేసిన సిగరెట్ పీక, చింపేసిన టికెట్, వెంట్రుక... ఇలా ప్రతీ చిన్న వస్తువూ పోలీసులకు ఎంతో పెద్ద ఆధారమవుతుంది. కొన్ని సందర్భాల్లో ఆ చిన్న ఆధారాలే సదరు కేసులను ఛేదిస్తాయి కూడా..! ఇక్కడ కూడా అచ్చం అలాంటి ఘటనే జరిగింది. కేవలం చిన్న కాగితం ముక్క... ముప్పు తిప్పలు పడుతున్న పోలీసులకు దర్యాప్తు చేసేందుకు క్లూ ఇచ్చి... కేసును ఓ దారిలో పెట్టింది.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీసు ఠాణా పరిధిలో ఈనెల 4న అనుమానాస్పద స్థితిలో సగం కాలిన గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. ఆమె వద్ద ఎలాంటి ఆధారం దొరకని స్థితిలో పోలీసులకు... ఆ మహిళ చీర కొంగులో ఒక ఫోన్ నంబర్ కాగితం లభించింది. పోలీసులు ఆరా తీయగా... ఆ నంబరు నేరేడ్మెట్కు చెందిన చెన్నయ్యదని గుర్తించారు. చెన్నయ్యను మల్కాజిగిరి ఎస్పోటీ పోలీసులు విచారించగా... సదరు మహిళతో పరిచయం ఉన్నట్టు అంగీకరించారు.
ఆ మహిళ... జూబ్లీహిల్స్ ఠాణా పరిధిలోని వెంకటగిరిలో నివసించే అనంతయ్య భార్య వెంకటమ్మగా గుర్తించారు. మృతురాలు... జూబ్లీహిల్స్ పోలీసు ఠాణా పరిధిలో అదృశ్యమైన మహిళగా తేల్చిన పోలీసులు... ఆమెది హత్యగా ప్రాథమికంగా నిర్ధరించారు. హత్య వెనక గల కారణాలపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. డిసెంబర్ 30న వెంకటమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తిరిగి రాకపోవడం వల్ల జనవరి ఒకటిన భర్త అనంతయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదృశ్యం కేసు నమోదు చేసిన పోలీసులు... వెంకటమ్మ ఉపయోగించిన ఫోన్ ద్వారా దర్యాప్తు చేశారు. బేగంపేట ప్రాంతంలో స్విచ్ఛాఫ్ అయినట్టు గుర్తించారు.
దర్యాప్తునకు సాంకేతికంగా ఆటంకం ఏర్పడింది. ఇదే సమయంలో ఎస్వోటీ పోలీసులు సమాచారం ఇవ్వగా... జూబ్లీహిల్స్, ఘట్కేసర్ పోలీసులు సంయుక్తంగా మహిళను హత్య చేసిన నిందితుల కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఆమె మొబైల్ నుంచి వెళ్లిన చివరి కాల్ డేటాతో విచారిస్తున్నారు. మరో వైపు పరిచయమున్న పలువురిని పిలిపించి ఆరా తీస్తున్నారు.