'నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు' పథకంలో తనకు ఇంటి పట్టా రాలేదని ఆవేదనకు గురైన ఓ వ్యక్తి ఫూటుగా మద్యం సేవించి ఏకంగా జాతీయ రహదారిని దిగ్బంధించాడు. ఏపీలోని నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. అనంతసాగరం మండలానికి చెందిన నాగరాజు... తన భార్య, పిల్లలతో కలిసి మర్రిపాడులో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
ఇటీవల ప్రభుత్వం ఇచ్చే ఇంటి స్థలం కోసం నాగరాజు దరఖాస్తు చేసుకున్నాడు. అర్హుల జాబితాలో తన పేరు లేకపోవటంతో మద్యం తాగి జాతీయ రహదారిపై వీరంగం సృష్టించాడు. టేబుళ్లు, కుర్చీలను రోడ్డుపై పెట్టి వాహనాలను అడ్డుకున్నాడు. ప్రభుత్వం తనకు ఇంటి పట్టా ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీనివల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తింది. స్థానికులు అతడిని మందలించి టేబుళ్లు, కుర్చీలను తొలగించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నాగరాజును అదుపులోకి తీసుకున్నారు.
ఇదీ చదవండి: రోడ్డుపై ప్రయాణిస్తున్నప్పుడు జాగ్రత్తే శ్రీరామరక్ష